Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూలై 1 : విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని "భారతదేశంలో ఫాసిజం: ప్రత్యేకతలు" అంశంపై నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను బుధవారం కాటారం అంబేడ్కర్ సెంటర్లో ఆవిష్కరించారు. విరసం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య మాట్లాడుతూ, జూలై 5, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో "భారతదేశంలో ఫాసిజం: ప్రత్యేకతలు" అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఫాసిస్టు ధోరణులను ప్రజలు అర్థం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దువ్వాసి పార్వతి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, పౌర హక్కుల విషయంలో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రజలను విభజించే విధానాలకు వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బాపు మాట్లాడుతూ, ఫాసిజం స్వరూపాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించి, దానిని ఎదుర్కొనే సమగ్ర ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల రాజకీయాలతో మాత్రమే సమస్యలకు పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేష్ మాట్లాడుతూ, సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు రచయితలు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి పనిచేయాలని కోరారు. ఫాసిస్టు ధోరణులను ఎదుర్కొనే భావజాల చర్చలకు ఈ సదస్సు వేదిక కానుందని తెలిపారు. ప్రజాస్వామికవాదులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరై జూలై 5న జరిగే సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, ఆదివాసీ మహిళా నాయకురాలు రాజమణి, ప్రజా సంఘాల నాయకుడు జాగిరి బాలయ్యతో పాటు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






