ప్రతి మండలంలో మద్యం దుకాణం తప్పక కనిపిస్తోంది. కానీ అదే మండలంలో ఒక సరిగ్గా పనిచేసే గ్రంథాలయం కనిపించడం మాత్రం కష్టంగా మారింది. ఇది సమాజ అభివృద్ధి దిశపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య. ఆ విద్యకు బలం ఇచ్చేది గ్రంథాలయాలు. కానీ నేటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జ్ఞానాన్ని పక్కన పెట్టడం జరుగుతోంది. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు సరైన పుస్తకాలు, ప్రశాంత వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వైన్స్ దుకాణాలు రాత్రివేళల వరకు కిటకిటలాడుతుంటే… మరోవైపు గ్రంథాలయాలు లేక యువత ఖాళీగా తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మండలంలో కనీసం ఒక ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం అత్యవసరం. పుస్తకాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు జిల్లాలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన క్రికెట్ కోచ్ శ్రీనివాస్ కుమారుడు నయన్ ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎల్బీనగర్కు చెందిన తొగరి శశాంక్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇక కృష్ణ కాలనీకి చెందిన టీఆర్పీ పార్టీ జిల్లా నాయకుడు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా రవి పటేల్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
పెద్దపల్లి.మార్చి.1,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)44 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి చేరిన మావో మల్లోజుల పెద్దపెళ్లికి కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపు..మావోయిస్టు పార్టీ మాజీ పొలిటి బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య తారతో కలిసి.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి ఆదివారం వచ్చారు.సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి అలింగణం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.1980 వ దశలో అన్న కిషన్ జితో కలిసి ఉద్యమ బాటపట్టి 44 ఏళ్ల పాటు సాయిధ పోరాట జీవితం గడిపిన మల్లోజుల ఇటీవల తన భార్య తారతో కలిసి మహారాష్ట్ర సీఎం ముందు ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన విషయం తెలిసిందే..అయితే అప్పటినుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తున్నది.మల్లోజుల సోదరుడు అంజన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యారు.ఆయనను కలవడానికి వచ్చిన మల్లోజులను.పెద్ద సంఖ్యలో బంధువులు.స్నేహితులు తరలివచ్చారు కొంతసేపు కుటుంబ సభ్యులు.స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటించారు.ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అందరితో కలిసి ఫోటోలు దిగారు.మల్లోజుల పర్యటనకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.మల్లోజుల వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసు బృందం అక్కడి కదలికలపై ప్రత్యేకంగా నిఘ ఉంచింది.అయితే మల్లోజుల మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.మల్లోజుల రాక పెద్దపల్లిలో చర్చనీయంగా మారింది...
కాటారం మండలం కొత్తపల్లి సుందరాజ్పేట్ గ్రామంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిధిలో కాలువలు నిర్మించవద్దని కోరుతూ ఇరిగేషన్ డీఈకు వినతిపత్రం సమర్పించారు. కాలువల నిర్మాణం వల్ల సాగుభూములు నష్టపోయే ప్రమాదం ఉందని, పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. భూములు కోల్పోతే జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములను రక్షిస్తూ కాలువ మార్గాన్ని మార్చాలని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వేసవికాలంలో తలెత్తే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సమ్మర్ వాటర్ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. గ్రామ పరిధిలోని దంతాలపల్లి, శ్రీనివాస కాలనీ, బొప్పారం ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు పరిశీలించారు. మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ ఏఈతో కలిసి గ్రామంలోని వాటర్ ట్యాంకులను తనిఖీ చేసి, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలించారు. వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. దంతాలపల్లి, బొప్పారం ప్రాంతాల్లో కొత్త బోర్లు మంజూరు చేయాలని గ్రామ ప్రతినిధులు కోరగా, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొర్రల్ల రాజయ్య, అసిస్టెంట్ సంపత్, లైన్మెన్ వెంకటేశ్వర్లు, బాల్నే ప్రవీణ్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేసవికాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర సందర్భంగా ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఓ వార్త వేగంగా వైరల్ అయింది. ఈ వార్త కారణంగా భక్తులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని పోలీసులు స్పష్టంచేశారు. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, మామిడితోట ప్రాంతంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఐదుగురు యువకులు వాష్రూమ్కు వెళ్లిన బాలికపై అత్యాచారం చేశారని, అనంతరం జంపన్నవాగు సమీపంలో ఓ షాపులో దాక్కున్న వారిని పోలీసులు పట్టుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపిన అనంతరం, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని కూడా అధికారులు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన ములుగు జిల్లా పోలీసు అధికారులు, మేడారం జాతర ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని వివరించారు. జాతర ప్రాంగణం అంతటా భారీగా పోలీస్ బలగాలు, మహిళా పోలీసులు, ప్రత్యేక నిఘా బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. జాతర జరుగుతున్న కాలంలో ప్రతి ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీసుల ప్రకారం, సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా ప్రచారం అవుతున్న వార్తలు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడమే కాకుండా, శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతాయి. అందుకే, ఎవరైనా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారం మాత్రమే విశ్వసించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. జాతర శాంతియుతంగా, సురక్షితంగా కొనసాగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రాంతం మంగళవారం ఉదయం ఒక్కసారిగా భయాందోళనలకు కేంద్రంగా మారింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఫర్నీచర్ షాపులో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపులో ఉన్న సోఫాలు, చెక్క ఫర్నీచర్, వార్నిష్ సామగ్రి కారణంగా మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించి, భారీగా ఎగసిపడ్డాయి. మంటలతో పాటు దట్టమైన నల్ల పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. షాపు పక్కనే ఉన్న వాణిజ్య సముదాయాలు, నివాస భవనాల్లో ఉన్నవారు ప్రాణభయంతో ఖాళీ చేశారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో ఇద్దరు చిన్నారులు చిక్కుకున్నారని సమాచారం రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. భవనం లోపలికి వెళ్లి నీటి జెట్లు, ఫోమ్ స్ప్రేలు ఉపయోగిస్తూ మంటల వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నించారు. ఒకవైపు మంటలను ఆర్పుతూ, మరోవైపు లోపల చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ ఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్, పోలీస్, రెస్క్యూ బృందాలకు తగిన సూచనలు ఇస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత భవనానికి జరిగిన నష్టం, ప్రాణనష్టం వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంతో నాంపల్లి ప్రాంతం మొత్తం కొంతసేపు ఉలిక్కిపడింది. నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్ల వినోద్ (30) అనే యువకుడు పొలంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, వినోద్ తన పొలంలో ట్రాక్టరుతో రూట్ వెయిటర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద నలిగిపోయిన వినోద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామ నూతన సర్పంచ్ లావణ్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వినోద్ మృతి వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబంలో ఆయన ఏకైక ఆధారమని తెలిసింది. యువకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



















