మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిపోయిన రెండు వర్గాలు తిరిగి ఏకం కావాలనే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. NCP, NCP–శరద్ పవార్ (NCP-SP) వర్గాల రీయూనియన్పై ఫిబ్రవరి రెండో వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ చీలిక తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు, ప్రజల్లో స్పందనను దృష్టిలో పెట్టుకుని గత కొన్ని నెలలుగా అజిత్ పవార్–శరద్ పవార్ మధ్య అంతర్గతంగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తు, నాయకత్వ నిర్మాణం, కూటమి రాజకీయాలపై పలు దఫాలుగా సమావేశాలు జరిగినట్లు సమాచారం. అజిత్ పవార్ మరణం తర్వాత ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయని, పార్టీని మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావాలనే అభిప్రాయం బలపడినట్లు తెలుస్తోంది. విలీనం జరిగితే NCP మహాయుతి కూటమిలోనే కొనసాగుతుందన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ–శివసేన (శిండే వర్గం)తో కలిసి ముందుకు సాగాలన్న వ్యూహమే ప్రస్తుతం పార్టీ పెద్దల ఆలోచనగా టాక్. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ విభజన వల్ల కోల్పోయిన రాజకీయ బలం తిరిగి సాధించడమే ఈ విలీనానికి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ పునర్వ్యవస్థీకరణలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. రాష్ట్రస్థాయిలో సునేత్రా పవార్ లేదా ప్రఫుల్ పటేల్ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముందని సమాచారం. మరోవైపు జాతీయ స్థాయిలో శరద్ పవార్ నాయకత్వం కొనసాగుతుందని, ఆయన మార్గదర్శకత్వంలో పార్టీ కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లనుందని టాక్. యువ నాయకత్వానికి కూడా ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విలీనం అమలైతే మహా వికాస్ అఘాడీకి ఇది భారీ రాజకీయ షాక్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ప్రతిపక్షంలో కీలకంగా ఉన్న NCP పూర్తిగా మహాయుతి వైపు మొగ్గు చూపితే, ప్రతిపక్ష శక్తి సమీకరణాలు బలహీనపడే పరిస్థితి ఏర్పడనుందని అంచనా. అదే సమయంలో మహాయుతి మరింత బలపడి, రాబోయే ఎన్నికల్లో ఆధిపత్యం సాధించే అవకాశం పెరుగుతుందని విశ్లేషణ. మొత్తంగా చూస్తే, ఫిబ్రవరి రెండో వారంలో వెలువడే ప్రకటన మహారాష్ట్ర రాజకీయ దిశనే మార్చే కీలక మలుపుగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. NCP రీయూనియన్పై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
Home
POLITICS ( రాజకీయం )
NCP రెండు వర్గాల విలీనం?.. ఫిబ్రవరి రెండో వారంలో కీలక ప్రకటనకు రంగం సిద్ధం

Post A Comment: