హైదరాబాద్లో రాజకీయంగా సంచలనం రేపుతున్న ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్పై పోక్సో కేసు నమోదైంది. తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌజ్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో కూడా అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సాయి భగీరధ్పై BNS సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, తమ కూతురు ఈ ఘటన కారణంగా రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ వర్గం మాత్రం ఈ వ్యవహారం హనీ ట్రాప్ అని, రూ.5 కోట్లు డిమాండ్ చేశారని చెబుతోంది. అంతేకాకుండా ఇప్పటికే రూ.50 వేల రూపాయలు ఇచ్చామని కూడా పేర్కొంటున్నారు. అయితే “ఎలాంటి తప్పు చేయనప్పుడు రూ.50 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు?” అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం అందించే హామీతో సహా అన్ని సంక్షేమ పథకాలను ఈ ఐదేళ్ల పదవీకాలంలో పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే మళ్లీ ఓట్ల కోసం వారి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వం మాట తప్పదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరును దెబ్బతీయడానికే అబద్ధపు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని, మంత్రులందరూ కలిసి సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే వరకు విశ్రాంతి తీసుకోమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.


