జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. రూరల్ పరిధిలోని గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాలకు చెందిన పలువురు యువకులు భారీ ఎత్తున పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బహుజన వర్గాలు పార్టీకి అండగా నిలుస్తున్నాయని, పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో వంద మందిని చైతన్యపరిచి భూపాలపల్లిలో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పేదల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్లను రవి పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్తో పాటు గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్: మండలంలోని బొమ్మాపూర్ గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన శ్రీకాంత్ శవం ఎలికేశ్వరం గ్రామ శివారులో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది హత్యా, ఆత్మహత్యా లేక ఇతర కారణమా అన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సాధు సంగీత ముదిరాజ్ అనే మహిళ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, సంగీత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం తీవ్రంగా ఖండనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హనుమకొండలోని సాధు సంగీత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి మనోధైర్యం చెప్పి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ— రాష్ట్రంలో ఒక మహిళ కానిస్టేబుల్కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక బీసీ మహిళ ప్రాణాలు కోల్పోయినా, ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ నిందితులు స్వేచ్ఛగా తిరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సాధు సంగీత ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
క్యాంపు కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా జనగణనను స్వీయ నమోదు చేసుకున్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు. ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా జనగణన స్వీయ గణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా మంగళవారం శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వీయ గనణలో తమ వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ కొరకు https://se.census.gov.in లింక్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయాలని, ఓటిపి నమోదు చేసి జిల్లా, పట్టణం, గ్రామం, పిన్ కోడ్ నమోదు చేయాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గనణలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిళ్లలో మే 10వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని తదుపరి మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఎన్యూమ రేటర్లుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన సమయంలో వచ్చిన ఐడి నంబర్ తెలియచేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడి నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్, డిప్యూటీ ఎస్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల అభివృద్ధికి పునాది వేస్తూ ‘అమ్మవడి మొదటి బడి’గా నిలుస్తున్నాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూపాలపల్లి డివిజన్ అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం, సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాల జాబితాను సమర్పించాలని, వాటికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేసి భవనాల నిర్మాణం చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడిల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామ స్థాయిలో సేవలందించే సైనికులని పేర్కొంటూ, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి సేవలు ఎంతో దోహదపడు తున్నాయని అన్నారు. ప్రతి బిడ్డకు కనీసం ఆరు నెలలు తల్లిపాలు అందేలా చూడాలని, పోషకాహారం తీసుకునేలా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను చైతన్యపరచాలని సూచించారు. అంగన్వాడి సేవలను మరింత పారదర్శకంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా స్మార్ట్ఫోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్వహిస్తున్న వివిధ సర్వేల్లో అంగన్వాడి సిబ్బంది భాగస్వాములు అవుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూపాలపల్లి డివిజన్లోని 418 మంది అంగన్వాడి సిబ్బందికి స్మార్ట్ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పోషణ మాసం నిర్వహించినట్లు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో గర్భిణీలు, చిన్నారులకు సేవలు అందించడంలో అంగన్వాడి సిబ్బంది ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ప్రతి చిన్నారి, గర్భిణి వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని, పథకాల సమర్థవంతమైన అమలుకు అది దోహదపడుతుందని సూచించారు. ప్రతి కేంద్రంలో పిల్లల ఆరోగ్య రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అనంతరం చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంధాలయ సంస్థల ఛైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి, కౌన్సిలర్లు, ఆర్టీఐ సభ్యులు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలో మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరమ్మతులు చేయాల్సిన పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ, మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మరమత్తులకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలని ఆయన సంబందిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 31 పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలో నూరు శాతం మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా ఉండాలని స్పష్టంచేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులను మే 10 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తి అయిన పనులకు అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. టెండర్ పూర్తి అయిన పనులను తక్షణమే మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న "వెల్ఫేర్ వీక్" సందర్భంగా అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో సంబంధిత శాఖల సంక్షేమ అధికారులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26 వరకు "వెల్ఫేర్ వీక్" నిర్వహణలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాటిలో ముఖ్యంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు సంక్షేమ హాస్టళ్లను అధికారులు సందర్శించి హాస్టల్ భవనాలు మరియు విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందే విధంగా చూడాలన్నారు. ఏప్రిల్ 23న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి పాఠశాల అభివృద్ధి గురించి విద్యార్థుల పురోగతి గురించి చర్చించడం, తల్లిదండ్రులను మాట్లాడించడం మరియు వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం చేయాలన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని తెలిపారు. ఏప్రిల్ 24 తేదీన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, దీనిలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం వివిధ అవకాశాలపై అవగాహన కల్పించడం, వాటిలో నమోదు అయ్యేలా చూడడం మరియు ఉపాధి అవకాశాల కల్పించే ఉద్దేశంలో నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భూపాలపల్లి, కాటారం ఏటిసి కేంద్రాల్లో విద్యార్థులకు వృత్తి నైపుణ్యం తరగతులు నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్ 25 తేదీన విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహించి క్రీడలు, కళలు, హస్తకళలు, సంగీతం, డిజిటల్ లెర్నింగ్ మరియు వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగహన కల్పించాలని సూచించారు. ఏప్రిల్ 26 తేదీన బడిబాట /హాస్టల్ బాట కార్యక్రమం నిర్వహించాలని, దీనిలో భాగంగా పాఠశాలలో ఖాళీలను గుర్తించడం ప్రత్యేక డ్రైవ్ పెట్టి విద్యార్థులను గుర్తించాలని, అలాగే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా ఖాళీ లను భర్తీ చేయాలని సూచించారు. వెల్ఫేర్ వీక్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమానికి రిపోర్టులు పంపాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, బిసి సంక్షేమ అధికారి ఇందిర, పీఆర్, గిరిజన, టీడబ్లుఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ సునీత, ఎంపిడివో సురేందర్, సర్పంచ్ విజయ, ప్రిన్సిపల్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా TGSRTC జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి డిపో ముందు జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని కార్మికులకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డిపో ముందు కార్మికులతో కలిసి కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ రవి పటేల్ గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక డిమాండ్లు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణలో 30% ఫిట్మెంట్ అమలు చేయాలని, అలాగే 2025 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి ₹400 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, కార్మికులపై ఉన్న పనిభారం తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి వెంటనే ఆర్టీసీకి అందించాలని, అద్దె బస్సు డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేయాలని, అధిక సంఖ్యలో బస్సులను పునరుద్ధరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని రవి పటేల్ గారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, కార్మికుల న్యాయపరమైన పోరాటంలో తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా కార్మిక సంఘం నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు అనంతల సంపత్, జిల్లా కోశాధికారి జిలకర శ్రీను, జిల్లా కమిటీ సభ్యుడు వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా న్యాయవాదుల ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఏ. నాగరాజు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. గద్వాల జిల్లా కి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నాగరాజు సేవలను కొనియాడుతూ, ఆయన న్యాయపరమైన కృషి మరియు నిష్పక్షపాత ధోరణిని ప్రశంసించారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ట్రెజరర్ ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు. అలాగే న్యాయవాదులు రవికుమార్, రాజేందర్, నీలం ప్రశాంత్, చీర్ల అశోక్, సతీష్, సురేందర్, ఎండీ రఫీ, రాయం రమేష్, శ్రీనివాస్ చారి, వసంత, ప్రియాంక, సంధ్య తదితరులు హాజరయ్యారు. న్యాయమూర్తి నాగరాజు మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా ప్రజల ప్రేమ, సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అంబేద్కర్ చౌరస్తా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం టీఆర్పీ పార్టీ సాధించిన రెండో విజయమని పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఈ నివేదికను పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కలిపి 94 శాతం ఉన్నాయని, వారి అభ్యున్నతి కోసం టీఆర్పీ నిరంతరం పోరాటం కొనసాగిస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తున్న ఏకైక పార్టీ టీఆర్పీదేనని పేర్కొన్నారు. అలాగే గతంలో “ముగ్గురు పిల్లల నిబంధన” ఎత్తివేయడంలో కూడా తీన్మార్ మల్లన్న పోరాటం ఫలించిందని, అది పార్టీకి తొలి విజయమైతే, కులగణన నివేదిక విడుదల రెండో విజయమని వివరించారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, బడుగు వర్గాల పక్షాన నిలబడుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మార్పు కోరుకుంటారని, 2028లో టీఆర్పీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో కార్పొరేట్ స్థాయి సేవలను ప్రజలకు అందించేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, యువజన విభాగం అధ్యక్షుడు బండి సునీల్, మహిళా విభాగం అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా కోశాధికారి జినూకల శ్రీను, ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షుడు అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.
హనుమకొండలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కళాకారుల సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు డప్పు, కోలాటం, భజన కళాకారులతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పరస్పరం పరిచయ కార్యక్రమం నిర్వహించుకుని, అనంతరం కళాకారులు తమ సమస్యలను విపులంగా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ కళలను కొనసాగిస్తున్న కళాకారుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల సమస్యలను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ముఖ్య అతిథి రవి పటేల్ మాట్లాడుతూ కళాకారుల సమస్యలను ఎమ్మెల్సీ మల్లన్నకు వివరించి, శాసన మండలిలో చర్చకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అలాగే త్వరలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కళాకారులు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘం నాయకులకు, కళాకారులకు రవి పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.
భూపాలపల్లి: రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే వాదనలు పూర్తయిన ఈ కేసులో, తుది తీర్పును ఈ నెల 22వ తేదీన వెల్లడించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చులు, సాంకేతిక అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. కమిషన్ సమర్పించిన నివేదికపై వివిధ అభ్యంతరాలు వ్యక్తమవడంతో, దాన్ని సవాలు చేస్తూ పలువురు ప్రముఖులు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ విధానం, దాని పరిధి, నివేదిక చట్టబద్ధతపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమిషన్ నియామకం రాజ్యాంగ విరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కమిషన్ నియామకం పూర్తిగా చట్టబద్ధమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని కోర్టుకు వివరించారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడం అవసరమని, అందుకే కమిషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు సమగ్రంగా విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, నిర్ణయాన్ని ప్రకటించాల్సిన రోజున మరోసారి వాయిదా వేయడం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశముండటంతో, అన్ని వర్గాల దృష్టి ఇప్పుడు 22వ తేదీపై నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన నేపథ్యంలో, హైకోర్టు తుది తీర్పు కీలక మలుపు తిప్పే అవకాశముంది. కమిషన్ నివేదిక చెల్లుబాటు అవుతుందా? లేక రద్దవుతుందా? అనే అంశంపై స్పష్టత రానుంది. తుది తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.
భూపాలపల్లి, ఏప్రిల్ 9 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భూపాలపల్లి KTPP ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆయన పాల్గొన్నారు. గత రెండు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న రవి పటేల్ అనంతరం మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆర్టిజన్లుగా విలీనం కాని కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించి, వారి విద్యార్హతలకు అనుగుణంగా కన్వర్షన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు కొనసాగుతున్న నిరసన దీక్షలకు కూడా ఆయన సంఘీభావం తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న అన్మాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, వారికి భద్రతా చర్యలు కల్పించాలని, విద్యార్హతల ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఈ కార్మికుల సేవలపై ఆధారపడి ఉందని, వారి సమస్యలను విద్యుత్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఆర్టిజన్ కార్మికులు లేకుండా విద్యుత్ శాఖ ఒక్కరోజు కూడా ముందుకు సాగలేదని స్పష్టం చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించిన రవి పటేల్, భూపాలపల్లి జిల్లాలో కార్మికులు ఎప్పుడైనా పిలుపునిచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుండి పోరాడతారని హామీ ఇచ్చారు. కార్మికులు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు అనంతల సంపత్ (బొట్టు), ఎలక్ట్రిషియన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా నాయకులు ప్రణయ్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మొగుళ్లపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూత్ అధ్యక్షుడు రవి కుమార్ యాదవ్ సోదరి వివాహం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులు బండారి శివాని – అశోక్ యాదవ్లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా సింగరేణి కార్మిక విభాగం అధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా నాయకులు వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరై సందడి చేశారు.





















