జయశంకర్ భూపాలపల్లి జిల్లా: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహోన్నత యోధుడని అన్నారు. సామాన్య ప్రజలను ఏకం చేసి, అప్పటి సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపారని కొనియాడారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా పోరాటాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కుల, ఆర్థిక, సామాజిక వివక్షలకు తావులేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయడమే సర్వాయి పాపన్న గౌడ్కు అందించే నిజమైన నివాళి అని రవి పటేల్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, గౌరవప్రదమైన జీవితం ప్రతి పేదవాడికి అందేలా పోరాడుతామని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడితే, నేడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సామాజిక న్యాయం, సమానత్వం, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతోందని రవి పటేల్ అన్నారు. బహుజనుల హక్కుల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్కు ఘన నివాళులు అర్పించారు.
భూపాలపల్లి: ఈ నెల 19న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట్ల ప్రవీణ్ రానున్న నేపథ్యంలో జిల్లాలోని దళితులు, దళిత సంఘాల నాయకులు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని జేఏసీ చైర్మన్ పీక కిరణ్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశంలో కమిషన్ చైర్మన్, సభ్యులు, పలువురు అధికారులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్, ప్రమోషన్లు, దళితులపై జరుగుతున్న కుల వివక్ష, అంటరానితనం, సామాజిక వివక్ష వంటి అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఆధిపత్య కులాల పెత్తనం, దళితులపై వివక్ష, అలాగే ఆయా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించాలని పీక కిరణ్ కోరారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దళిత వర్గాలకు సంబంధించిన సమస్యలను కమిషన్ చైర్మన్, సభ్యుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల జిల్లా కన్వీనర్ అజ్మిర పూల్సింగ్, జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు పాల్గొన్నారు.
కాటారం, ఆగస్టు 17: నాటుసారాయి తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కె. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హెచ్. దత్తురాజ్ గౌడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి బి. కిరణ్ ఆదేశాల మేరకు కాటారం ఎక్సైజ్ స్టేషన్, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ వరంగల్, జిల్లా టాస్క్ఫోర్స్, భూపాలపల్లి స్టేషన్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మహాముత్తారం మండలంలోని కోర్లకుంట, దొబ్బలపాడు, మలహర్ మండలంలోని ఎడ్లపల్లి, కొండంపేట, కాటారం మండలంలోని గంగారం, చింతకాని గ్రామాల్లో నాటుసారాయి తయారీ స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 10 మందిపై కేసులు నమోదు చేసి, 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అధికారులు 46 లీటర్ల నాటుసారాయి, 20 కిలోల చక్కెర, 2 కిలోల డ్రై ఈస్ట్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన 1,250 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా నాటుసారాయి వల్ల కలిగే అనర్థాలు, ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావంపై అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాటుసారాయి తయారు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా లేదా విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో కాటారం ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాదావత్ కిష్టయ్య, జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్. రాజ సమ్మయ్య, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, చంద్రశేఖర్, భూపాలపల్లి ఎస్ఐ ఎస్కే. రబ్బానీతో పాటు హెడ్ కానిస్టేబుల్ గణేష్, కానిస్టేబుళ్లు కృష్ణ నాయక్, శ్రీనాథ్, హుస్సేన్, కుమార్ పాల్గొన్నారు.
భూపాలపల్లి: జర్నలిస్ట్ పుల్ల రవీందర్పై ఆదివారం రాత్రి జరిగిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి భూపాలపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. జర్నలిస్టుపై దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. గతంలో చిట్యాల మండలంలో బీసీ యువకుడిపై దాడి జరిగినప్పుడు బాధితుడికి అండగా నిలిచి న్యాయం కోసం పోరాడామని, ప్రస్తుతం దళిత జర్నలిస్టుపై జరిగిన దాడిని కూడా అదే విధంగా ఖండిస్తున్నామని తెలిపారు. కులం, వర్గం, రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలబడి న్యాయం కోసం పోరాడటమే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే జర్నలిస్టులపై భౌతిక దాడులు చేయడం ప్రజల సమాచార హక్కుపై, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రతను కాపాడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమని పేర్కొంటూ.. జర్నలిస్ట్ పుల్ల రవీందర్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తుందని రవి పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా వ్యవసాయ శాఖ విభాగం అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, శ్రీకాంత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే పత్రికారంగంపై, సమాజ హితమే ధ్యేయంగా పనిచేసే విలేఖరులపై భౌతిక దాడులకు తెగబడటం పత్రికా స్వేచ్ఛను నొక్కేసే కక్షపూరిత చర్య అని తెలంగాణ శ్రామిక పాత్రికేయుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్నల సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో విధి నిర్వహణలో ఉన్న విలేఖరిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తెస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే విలేఖరులకు రక్షణ లేకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు సేకరించే విలేఖరులపై ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థనే సవాలు చేయడమని పేర్కొన్నారు. చిట్యాల మండలంలో విలేఖరిపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విలేఖరులపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత విలేఖరికి పూర్తి వైద్య సహాయం అందించడంతో పాటు తగిన రక్షణ కల్పించాలని కోరారు. భవిష్యత్తులో విలేఖరులపై ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈర్నల సుమన్ హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.
జాదరావుపేట, ఆగస్టు 15: జాదరావుపేట గ్రామంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జాదరావుపేట గ్రామ వాస్తవ్యులు దుర్గం చంద్రశేఖర్, మల్లయ్య కుమారుడు, విద్యార్థుల పట్ల తనకున్న అభిమానం, సేవాభావాన్ని చాటుకున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ తన స్వహస్తాలతో స్కూల్ షూస్ను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడమే కాకుండా వారి చదువుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల చదువులు, ఆరోగ్యం పట్ల దుర్గం చంద్రశేఖర్ చూపిన ప్రత్యేక చొరవను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. సేవా కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం దుర్గం చంద్రశేఖర్ను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బండి సువర్ణ–రమేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు రవి, అజయ్, సురేష్తో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు స్కూల్ షూస్ పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం దుర్గం చంద్రశేఖర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వారి చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. దుర్గం చంద్రశేఖర్ ఇలాగే ఉన్నత శిఖరాలకు ఎదిగి గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు మరిన్ని సహాయ సహకారాలు అందించాలని గ్రామ పాలకవర్గం, పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించారు. విద్యార్థులకు స్కూల్ షూస్ అందించినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, ప్రసంగాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. పాఠశాల ప్రాంగణం జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, గ్రామ పాలకవర్గ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిస్తూ స్కూల్ షూస్ పంపిణీ చేసిన దుర్గం చంద్రశేఖర్ సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.
భూపాలపల్లి: ముదిరాజ్ బీసీ వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు, బీసీ ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఎర్ర సత్యం ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. ఎర్ర సత్యం ముదిరాజ్ బీసీ ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ఆయన చేసిన పోరాటాలు, సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. బీసీ ప్రజల హక్కులు, న్యాయమైన వాటా సాధించాలంటే సమాజంలోని బీసీ వర్గాలన్నీ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని రవి పటేల్ పేర్కొన్నారు. ఎర్ర సత్యం ముదిరాజ్ చూపిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎర్ర సత్యం ముదిరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రవి పటేల్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం బీసీ ప్రజలను ఏకం చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘాల నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొని ఎర్ర సత్యం ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
భూపాలపల్లి: ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన ఆదివాసీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న భూమి, పోడు భూములు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, హాస్టళ్లు, వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ఆదివాసీ యువతకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఆదివాసుల హక్కులను కేవలం ఆదివాసుల దినోత్సవం రోజున మాత్రమే గుర్తు చేసుకోకుండా, రాజ్యాంగబద్ధంగా వారి హక్కులను పరిరక్షించి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని రవి పటేల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ సంఘం విభాగం అధ్యక్షుడు సంతోష్ ఆదివాసీ, జిల్లా ఉపాధ్యక్షుడు వెనుకాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు సామల చంద్రశేఖర్, భూక్య సమ్మయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
కటారం, ఆగస్టు 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కటారం మండలం వీరాపూర్ గ్రామంలో గుడుంబా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో గుడుంబా విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తి వద్ద నుంచి సుమారు 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు గ్రామ పంచాయతీ వర్గాలు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న గుడుంబాను అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో నాశనం చేశారు. గ్రామంలో గుడుంబా విక్రయాలు, తయారీకి అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.
యువత భవిష్యత్తుపై ప్రభావం
గుడుంబా వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తడంతో పాటు యువత భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో గుడుంబా విక్రయాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని, గుడుంబా నియంత్రణకు అవసరమైన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. గ్రామాన్ని గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసం గ్రామ ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడైనా గుడుంబా విక్రయాలు లేదా తయారీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
ప్రజల సహకారం అవసరం
గుడుంబా నిర్మూలన ఒక్కరి బాధ్యత కాదని, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే పూర్తిస్థాయిలో నియంత్రించగలమని గ్రామ పంచాయతీ ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామంలో మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు భవిష్యత్తులోనూ అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ గుడుంబా నియంత్రణ కార్యక్రమంలో గుంటి కుమార్, గుమ్మల్లపల్లి ఉప సర్పంచ్ తాళ్ల శేఖర్ రెడ్డి, జాధరావుపేట ఉప సర్పంచ్ కోట అశోక్, 5వ వార్డు సభ్యుడు గడ్డల రాజమల్లు, బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు గద్దల సంతోష్, నరేష్, మంద మల్లేష్, లక్ష్మిమలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గుడుంబా విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టి వీరాపూర్ను గుడుంబా రహిత గ్రామంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రతినిధులు కోరారు.
తాడిచర్ల, ఆగస్టు 8: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉన్న నిబంధనలను తక్షణమే పునఃసమీక్షించాలని తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అయితే బాపు డిమాండ్ చేశారు. ప్రస్తుత నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి కనీసం రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. శనివారం మలహరరావు మండలం కొయ్యూరులో నిర్వహించిన అత్యవసర విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించాలని అన్నారు.
పేదలకు రూ.5 లక్షలేనా?
పాలకుల విలాసాలు, బంగ్లాల మరమ్మతులకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. నిరుపేద కుటుంబం జీవితాంతం నివసించే ఇంటి నిర్మాణానికి కేవలం రూ.5 లక్షలు కేటాయించడం సరికాదని బాపు విమర్శించారు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
విస్తీర్ణ పరిమితిని తొలగించాలి
ఇందిరమ్మ ఇళ్లకు 400 నుంచి 600 చదరపు అడుగుల వరకు మాత్రమే నిర్మాణ పరిమితి విధించడం పేద కుటుంబాలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. కుటుంబ అవసరాలు, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని కనీసం 1000 చదరపు అడుగుల విస్తీర్ణానికి అవకాశం కల్పించాలని కోరారు.
అప్పుల ఊబిలో లబ్ధిదారులు
ఇంటి నిర్మాణానికి అరకొరగా నిధులు రావడం, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారని బాపు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని కోరారు.
పోరాటాలకు సిద్ధం
ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలను పునఃసమీక్షించి పేదలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా కార్మిక, ప్రజా సంఘాలను ఏకం చేసి భారీ ఉద్యమాలు చేపడతామని బాపు హెచ్చరించారు. పేదల సొంతింటి కలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యుఐఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు, ఆదివాసీ మహిళా నాయకురాలు కాలినేని రాజమణి తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతిపత్రం అందించిన యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ,సమాచార హక్కు అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ కార్యాలయంలో సమాచార బోర్డులు లేకపోవడం ప్రభుత్వ అధికారులు సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పౌరులు దరఖాస్తు చేస్తే సరైన సమాచారం సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారని పౌరులు కోరిన సమాచారాన్ని పటిష్టంగా సకాలంలో అందించాలని ఆయనే కోరారు మండల కేంద్రంలో పరిధిలో రేషన్ షాపులో ప్రజలకు అందిస్తున్న ప్రజా పంపిణీలో బియ్యం తూకంలో తేడా వస్తున్నాయి దీనిపై చర్య తీసుకోవాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టిఐ మండల కన్వీనర్ ఏలేటి రామ్ రెడ్డి సత్యనారాయణ తిరుపతి పున్నం తిరుపతి చైతన్య గుప్తా తదితరులున్నారు.
గోరికొత్తపల్లి, జూలై 28: వ్యవసాయ పొలంలో నీటి మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతి చెందిన విషాద ఘటన భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం దామరంచపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కాడపాక సాగర్ వ్యవసాయ పనుల్లో భాగంగా పొలంలో మోటార్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే సాగర్ మృతి చెందినట్లు తెలిసింది. ఆయన ఆకస్మిక మృతితో దామరంచపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు సాగర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భూపాలపల్లి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీ ముదిరాజ్ ముద్దుబిడ్డ, పోరాట యోధుడు ఎర్ర సత్యం అన్న జయంతి వేడుకలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్తో పాటు నాయకులు ఎర్ర సత్యం అన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. ఎర్ర సత్యం అన్న తన జీవితాన్ని పేద ప్రజల సేవకు అంకితం చేశారని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ, తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహాయాన్ని అందించారని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ప్రాంతాల్లో ప్రజల ఆదరణ పొందిన నాయకుడిగా ఎర్ర సత్యం అన్న గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పేద ప్రజల గుండెల్లో నమ్మకాన్ని సంపాదించుకున్న అలాంటి ప్రజానాయకుడిని కొందరు వ్యక్తులు కక్షపూరిత ధోరణితో హత్య చేయడం అత్యంత బాధాకరమని రవి పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్ర సత్యం అన్న ఆశయాలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు సామల శ్రీలత, క్రమశిక్షణ కమిటీ నాయకుడు కరుణాకర్, కార్మిక విభాగం నాయకుడు అనంతుల సంపత్, ఎలక్ట్రిషియన్ విభాగం నాయకుడు అశోక్, జిల్లా నాయకులు సమ్మయ్య, రాంబాబు, సలీం, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి గోరి, జూలై 24: మండలంలోని జగ్గయ్యపేట పోలింగ్ స్టేషన్ నంబర్ 258 పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఓ ముడుపు చిరంజీవిని శుక్రవారం అధికారులు ఘనంగా సన్మానించారు. ఎమ్మార్వో, బీఎల్ఓ సూపర్వైజర్ రాజయ్య శాలువాతో సత్కరించి అభినందించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలోని మొత్తం 1,071 మంది ఓటర్ల వివరాల సవరణ, ధ్రువీకరణ, గణన ఫారాల ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేసినందుకు చిరంజీవి సేవలను అధికారులు ప్రశంసించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలో విధులను సమర్థవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన సిబ్బందిని కూడా అధికారులు అభినందించారు.
భూపాలపల్లి, జూలై 24: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు రవి పటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బంద్ నిర్వహించారు. బంద్కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై విద్యార్థులు 23 రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా అణచివేతకు పాల్పడటం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలపై స్పందించకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్టీఏ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా టీఆర్పీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లాలో విద్యాసంస్థల బంద్ నిర్వహించినట్లు తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎన్టీఏను రద్దు చేయడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ గట్ల రాజన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, వ్యవసాయ శాఖ జిల్లా అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్, గునికంటి విష్ణు, ప్రణీత్, శ్రీకాంత్, రాజేష్, రోడ్డ శ్రీనివాస్, నరేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి : విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఐసా (ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి, జిల్లా కార్యదర్శి బంధు సుజాత డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాట హక్కును హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తుతో పేపర్ లీకేజీలు చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. లాఠీచార్జి ఘటనపై కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమగ్ర ప్రక్షాళన చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల పోరాట హక్కును కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని, లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి విద్యాశాఖలో ప్రక్షాళన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.


























