Articles by "జయశంకర్ భూపాలపల్లి జిల్లా"
Showing posts with label జయశంకర్ భూపాలపల్లి జిల్లా. Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 23 : ఖరీఫ్-2026 సీజన్‌లో రైతులు అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో కాటారం మండలంలోని రేగులగూడెం, దామరకుంట క్లస్టర్లలో మంగళవారం సీడ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు వివిధ పంటలకు సంబంధించిన నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. 


రేగులగూడెం వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), దామరకుంట వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మాట్లాడుతూ రైతులు సకాలంలో విత్తనాలను సేకరించుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రగతిశీల రైతులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
భూపాలపల్లి, జూన్ 21: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ సభ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సామాజిక, రాజకీయ అభ్యున్నతే రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందాలని, బహుజన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రజలు పెద్ద ఎత్తున జూలై 5న జరిగే రాజ్యాధికార సమరభేరి సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, ప్రస్తుతం కొందరి చేతుల్లో నలిగిపోతోందని విమర్శించారు. రెడ్డి, వెలమ ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికి, బహుజన వర్గాలకు రాజ్యాధికారం సాధించాల్సిన సమయం ఆసన్నమైందని రవి పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, కృష్ణ ప్రశాంత్, శ్రీపతి, భద్రయ్య, రంజిత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, ప్రతినిధి: భూపాలపల్లి బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు చర్చనీయాంశంగా మారింది. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందనే అసంతృప్తి ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. సింగరేణి పరిరక్షణ పేరిట భూపాలపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అయితే ఈ సదస్సుకు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారికి ఆహ్వానం అందలేదనే ప్రచారం పార్టీలో చర్చకు దారితీసింది. అంతేకాకుండా కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రిలో మధుసూధనాచారి ఫోటో కనిపించకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తూ, విషయాన్ని నేరుగా హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామాలతో భూపాలపల్లి బీఆర్ఎస్‌లో గండ్ర వెంకటరమణారెడ్డి, సిరికొండ మధుసూధనాచారి వర్గాల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని గమనించిన హరీష్ రావు పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంగా భూపాలపల్లి బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తుండగా, ఈ వర్గపోరు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 12: భూపాలపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు శుక్రవారం భూపాలపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కార్యాలయానికి విచ్చేసిన హరీష్ రావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను పరిశీలించేందుకు ఓసీ–2 గనిని సందర్శించేందుకు హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. అయితే గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని చెబుతోందని, నిజంగా నిల్వలు ఉంటే వాటిని ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వల విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తుతో చెలగాటమాడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు గనిలోకి అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతసేపు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, జూన్ 12: శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్  సిరికొండ మధుసూదనాచారి శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 ఇంక్లైన్ గనిని సందర్శించి సింగరేణి కార్మికులతో మమేకమయ్యారు. గనిలోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ కార్మికుల పనితీరు, పని పరిస్థితులు, సంక్షేమ సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా క్యాంటీన్, డిస్పాచ్, మ్యాన్‌రైడింగ్, విశ్రాంతి గదులు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆయన కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా గనిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కార్మికులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన మధుసూదనాచారి, సింగరేణి జనరల్ మేనేజర్‌కు ఫోన్ చేసి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు. కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. 


సింగరేణి సంస్థ అభివృద్ధికి కార్మికులే వెన్నెముక అని పేర్కొన్న ఆయన, కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో యాజమాన్యం మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు తమ వంతు కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం భూపాలపల్లి పట్టణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్‌రావు హాజరు కానున్న సింగరేణి కార్మిక సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, సింగరేణి భవిష్యత్తుపై జరిగే ఈ సదస్సు ప్రాధాన్యతను వివరించి అందరూ పాల్గొనాలని కోరారు. మధుసూదనాచారి పర్యటన సందర్భంగా పలువురు కార్మిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, జూన్ 10: అటవీ భూముల వ్యవహారంలో అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిమ్మగూడెం బిట్ అధికారి శ్రీకాంత్, రెడ్డిపల్లి బిట్ అధికారి అఖిల్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీసీఎఫ్)కు ఫిర్యాదు అందజేశారు. నిమ్మగూడెం పరిధిలో గత రెండు సంవత్సరాలుగా సుమారు 400 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా విక్రయించేందుకు అధికారులు సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించాలని కోరారు. అటవీ శాఖలో నియంత్రణ లేకుండా అవినీతి జరుగుతోందని ఆరోపించిన నాయకులు, ఈ అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు, కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, పీక కిరణ్, లవుడియా తిరుపతి నాయక్, దేవేందర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, జూన్ 8: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని, ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫీజులు నిర్ణయించే విధంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) నాయకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐసా జిల్లా కార్యదర్శి బి. సుజాత మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఐసా జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ అధిక సంఖ్యలో రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని భావించే తల్లిదండ్రుల ఆశలను కొందరు ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయని ఆరోపించారు. ఐఐటీ, జేఈఈ, నీట్, ఫౌండేషన్ కోర్సులు వంటి పేర్లతో ఆకర్షణీయ ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థులను చేర్పించుకుని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి ధనార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలోని ప్రజల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి అందుబాటు ఫీజులను నిర్ణయించే విధంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని TS-RFJS-093 ‘మీ సేవ’ కేంద్రం వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కోంపల్లి గ్రామానికి చెందిన స్థానికులు, బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిరునామా మార్పు, యజమాన్య బదిలీ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

కోంపల్లి నుంచి భూపాలపల్లికి తరలింపు

2012లో కోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 3 వేల జనాభాకు సేవలందించేందుకు శ్రీ కర్రు రమేష్ పేరిట TS-RFJS-093 మీ సేవ కేంద్రం మంజూరైంది. అనంతరం 2014లో కేంద్రం వివాదాల్లో చిక్కుకుంది. కేంద్రాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా భూపాలపల్లి పట్టణంలోని ఎంఆర్వో కార్యాలయం ఎదురుగా తరలించడంతో అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ కేంద్రాన్ని నిలిపివేసినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా చిరునామా మార్పు?

మీ సేవ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం మంజూరైన గ్రామ పంచాయతీ పరిధిలోనే కొనసాగాలి. ఒకవేళ తరలించాల్సి వచ్చినా గరిష్టంగా ఒక కిలోమీటర్ పరిధిలో మాత్రమే అనుమతి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే 2022లో కోంపల్లి నుంచి భూపాలపల్లిలోని మంజూర్ నగర్‌కు కేంద్రాన్ని తరలించారని, ఇది అసలు కేంద్ర స్థలానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేదా గ్రామ సభ ఆమోదం లేకుండానే కేవలం సర్పంచ్ వ్యక్తిగత ఎన్‌ఓసీ ఆధారంగా మార్పు జరిగిందని పేర్కొన్నారు.

యజమాన్య బదిలీపైనా అనుమానాలు

2024లో ఈ కేంద్రాన్ని వేముల కుమార్‌కు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బదిలీ ప్రక్రియలో నిబంధనలను పూర్తిగా పాటించలేదని ఆరోపించారు. ఫ్రాంచైజీని రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు బాండ్ పత్రాల్లో పేర్కొనడం గమనార్హమని, ఫ్రాంచైజీల కొనుగోలు, అమ్మకాలను నిషేధించే నిబంధనలు ఉన్నప్పటికీ లావాదేవీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈడీఎం పాత్రపై అనుమానాలు

మంజూర్ నగర్‌లోని కేంద్రానికి సమీపంలోనే మరో గదిలో అదనపు కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM) పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాంకు లావాదేవీలను ఏసీబీ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

పూర్తి విచారణ వరకు నిర్ణయాలు వద్దు

ప్రస్తుతం మరోసారి చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం ఉందని, పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్‌ను స్థానికులు కోరారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఫిర్యాదుదారు: అంగోత్ తిరుపతి

సెల్: 7702544818

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


భూపాలపల్లి, జూన్ 7 : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను ఆకర్షించేందుకు తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రచార పత్రాలలో పాఠశాల పేర్లతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్ ఫౌండేషన్ వంటి పదాలను ఉపయోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పేర్లను చూపిస్తూ తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పేద ప్రజలను మోసం చేస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. జూన్ 12లోపు ఆయా పదాలను తొలగించి, సంబంధిత ఫ్లెక్సీలు, పాంప్లెట్లు, ప్రకటనలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలల ముందు ఐసా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి బందు సుజాతతో పాటు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
పలిమెల, జూన్ 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ముకునూరు గ్రామానికి చెందిన దుగ్గిరాల రంగారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ముకునూరు గ్రామానికి చెందిన ఎర్రవెల్లి వసంతరావు తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తిప్పనపల్లి ముత్తయ్యను సైతం పరామర్శించి మెరుగైన వైద్య చికిత్స పొందాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం తన బాధ్యత అని ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, జూన్ 5: జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలల పేర్లతో పాటు "ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్, ఫౌండేషన్" వంటి పదాలను వినియోగిస్తూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జిల్లా కార్యదర్శి బి. సుజాత ఆరోపించారు. ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రచార పత్రికలు మరియు ఇతర ప్రకటనల్లో పాఠశాల పేర్లకు అదనంగా ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్ ఫౌండేషన్ వంటి పదాలను జోడించి ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఈ పదాలను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామనే భావన కల్పించి విద్యార్థులను ఆకర్షించడమే కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతి పొందిన రాష్ట్ర లేదా కేంద్ర సిలబస్‌లను మాత్రమే బోధించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు స్వలాభం కోసం ఈ తరహా పదాలను వినియోగిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి ప్రకటనల వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పేర్లను ఉపయోగిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే నేపథ్యంలో జూన్ 13వ తేదీలోపు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, పాంప్లెట్లు మరియు ఇతర ప్రచార సామగ్రి నుంచి ఈ పదాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ పేర్లను ఉపయోగిస్తున్న ప్రైవేట్ పాఠశాలల ఎదుట పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతితో పాటు సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, జూన్ 3: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపుల యాజమాన్యాలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎంఎల్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ బందు సుజాత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఫర్టిలైజర్ మరియు విత్తనాల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కోరారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న షాపుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని, రైతులకు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లులు ఇవ్వాలని సూచించారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా, మరోవైపు ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం రైతాంగంపై అదనపు భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఒక బస్తా ఎరువు ధర రూ.2,300కు చేరుకుందని, వెంటనే ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఆత్కూరి శ్రీకాంత్, బుర్ర స్వాతి, క్రాంతి, రవి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జూన్ 2:  తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ పితామహుడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి సాధించే దిశగా ప్రభుత్వం పనిచేయాలని కోరారు. కేవలం భౌగోళిక తెలంగాణతో సరిపెట్టకుండా, సామాజిక తెలంగాణ సాధించే వరకు టీఆర్పీ ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.


అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొంపల్లి గ్రామానికి చెందిన నడిగొట్టు కావ్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి తమ సానుభూతిని తెలియజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన శ్రీపతి జశ్వంత్ ఇటీవల చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి టీఆర్పీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాచారం గ్రామానికి చెందిన చీద్రాల మల్లమ్మ ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా కాసింపల్లి గ్రామానికి చెందిన మేకల సంపత్ తల్లి మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు గండు కరుణాకర్, ఇనుగాల ప్రణీత్, మామిడి శ్రీకాంత్, శ్రీపతి భద్రయ్య తదితరులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా మరియు అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐసా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐసా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బి. సుజాత మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రైవేటు పాఠశాలలు కనీస మౌలిక వసతులు లేకుండా, ప్లే గ్రౌండ్లు లేకుండా నడుస్తున్నాయని ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చుకుని పేద ప్రజల నుంచి నియంత్రణ లేని ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ జీవో నెంబర్ 91-2009కి విరుద్ధంగా “ఐఐటీ”, “జేఈఈ”, “ఒలంపియాడ్ కాన్సెప్ట్” వంటి పదాలతో బోర్డులు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆకర్షిస్తూ మోసపూరిత ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యాశాఖ నిర్ణయించిన సిలబస్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐసా జిల్లా అధ్యక్షురాలు బి. స్వాతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత జీవోలు 1, 16, 37, 42, 91లను పునరుద్ధరించి పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐసా విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి గడపకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సైనికులు ప్రజల మధ్యకు వెళ్లి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అభ్యున్నతి కోసం బలమైన బహుజన శక్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎదుగుతోందని తెలిపారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే బలమైన నాయకత్వాన్ని తయారు చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుండాలని రవి పటేల్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, మే 27: తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్ గనిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందిన కార్మికుడు కొండ్ర వెంకటేష్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వెంకటేష్ మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ఏఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలోని తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్‌లో గ్రేడర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురై మృతి చెందడం బాధాకరమని అన్నారు. కార్మికుడి మృతి విషయంలో ఏఎంఆర్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, ఇప్పటి వరకు కంపెనీ ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కార్మికుల భద్రత, సంక్షేమంపై కంపెనీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఆల్ ఇండియా సెంటర్ ఆఫ్ కౌన్సిల్ ట్రేడ్ యూనియన్ (AICCTU) జిల్లా అధ్యక్షుడు బందు క్రాంతి మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీసీకే యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు ఆత్కూరి శ్రీకాంత్, నాయకురాలు బుర్ర స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, మే 26: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ(ఎంఎల్) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల వల్ల పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదాల కారణంగా అరటి తోటలు, మిరప, మొక్కజొన్న తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతుల పంట నష్టాల వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవల అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేపాకపల్లె దంపతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదాల నివారణపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బంధు క్రాంతి, సుజాత, ఆత్కూరి శ్రీకాంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. రూరల్ పరిధిలోని గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాలకు చెందిన పలువురు యువకులు భారీ ఎత్తున పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బహుజన వర్గాలు పార్టీకి అండగా నిలుస్తున్నాయని, పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో వంద మందిని చైతన్యపరిచి భూపాలపల్లిలో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పేదల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్‌లను రవి పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్‌తో పాటు గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్: మండలంలోని బొమ్మాపూర్ గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన శ్రీకాంత్ శవం ఎలికేశ్వరం గ్రామ శివారులో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది హత్యా, ఆత్మహత్యా లేక ఇతర కారణమా అన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సాధు సంగీత ముదిరాజ్ అనే మహిళ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, సంగీత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం తీవ్రంగా ఖండనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హనుమకొండలోని సాధు సంగీత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి మనోధైర్యం చెప్పి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ— రాష్ట్రంలో ఒక మహిళ కానిస్టేబుల్‌కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక బీసీ మహిళ ప్రాణాలు కోల్పోయినా, ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ నిందితులు స్వేచ్ఛగా తిరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సాధు సంగీత ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.