భూపాలపల్లి: ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన ఆదివాసీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న భూమి, పోడు భూములు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, హాస్టళ్లు, వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ఆదివాసీ యువతకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఆదివాసుల హక్కులను కేవలం ఆదివాసుల దినోత్సవం రోజున మాత్రమే గుర్తు చేసుకోకుండా, రాజ్యాంగబద్ధంగా వారి హక్కులను పరిరక్షించి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని రవి పటేల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ సంఘం విభాగం అధ్యక్షుడు సంతోష్ ఆదివాసీ, జిల్లా ఉపాధ్యక్షుడు వెనుకాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు సామల చంద్రశేఖర్, భూక్య సమ్మయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.


Post A Comment: