Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
పలిమెల, జూలై 15: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని ఇంచంపల్లి ప్రాజెక్టును పునరుద్ధరించి జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతాన్ని పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. ఇంచంపల్లి ప్రాజెక్టుకు దశాబ్దాల చరిత్ర ఉందని, ఆనాటి నిజాం ప్రభుత్వం కూడా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. అయితే అప్పట్లో కలరా, ప్లేగు వంటి మహమ్మారుల కారణంగా పనులు నిలిచిపోయాయని, నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ఈ ప్రాంతంలో జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తే సరిహద్దు గ్రామాల యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. బీడు భూములు సస్యశ్యామలంగా మారి రైతాంగం ఆర్థికంగా బలోపేతం అవుతుందని తెలిపారు. నీటిపారుదల శాఖ, టీజెన్కో అధికారులు క్షేత్రస్థాయిలో వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సరిహద్దు ప్రాంత ప్రజలు, కుల సంఘాలను ఏకం చేసి భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు, లింగమల్ల సడవలి రావు తదితరులు పాల్గొన్నారు.







