MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూలై 1 : విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని "భారతదేశంలో ఫాసిజం: ప్రత్యేకతలు" అంశంపై నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను బుధవారం కాటారం అంబేడ్కర్ సెంటర్‌లో ఆవిష్కరించారు. విరసం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య మాట్లాడుతూ, జూలై 5, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో "భారతదేశంలో ఫాసిజం: ప్రత్యేకతలు" అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఫాసిస్టు ధోరణులను ప్రజలు అర్థం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దువ్వాసి పార్వతి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, పౌర హక్కుల విషయంలో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రజలను విభజించే విధానాలకు వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బాపు మాట్లాడుతూ, ఫాసిజం స్వరూపాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించి, దానిని ఎదుర్కొనే సమగ్ర ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల రాజకీయాలతో మాత్రమే సమస్యలకు పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేష్ మాట్లాడుతూ, సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు రచయితలు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి పనిచేయాలని కోరారు. ఫాసిస్టు ధోరణులను ఎదుర్కొనే భావజాల చర్చలకు ఈ సదస్సు వేదిక కానుందని తెలిపారు. ప్రజాస్వామికవాదులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరై జూలై 5న జరిగే సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, ఆదివాసీ మహిళా నాయకురాలు రాజమణి, ప్రజా సంఘాల నాయకుడు జాగిరి బాలయ్యతో పాటు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
 

కాటారం, జూలై 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలో ఈ నెల 29న జరిగిన వివాహిత రాజమని అలియాస్ రజిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త మంతెన సత్యం (43)ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంతెన సత్యం, రాజమని అలియాస్ రజిత దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రవళి (13), మాన్విత్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతోందనే అనుమానంతో సత్యం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్య మెడపై దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం హత్యకు ఉపయోగించిన కత్తి, ఘటన సమయంలో ధరించిన దుస్తులను తీసుకుని వాటిని ఎక్కడైనా పడేసి పరారవ్వాలనే ఉద్దేశంతో బయ్యారం వైపు నుంచి భూపాలపల్లి–కాటారం ప్రధాన రహదారికి వస్తుండగా, పోలీసులను గమనించిన నిందితుడు పరుగు తీశాడు. అప్రమత్తమైన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్‌ఐ  శ్రీనివాస్ మరియు పోలీసు సిబ్బంది వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని, అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించబడింది. ఈ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్‌ఐ చి. శ్రీనివాస్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ సూర్యనారాయణ అభినందించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
పరకాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ కోరారు. ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్యార్థుల చేరికలు పెరుగుతాయని అన్నారు. పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికే 15 రోజులు గడిచినా ఇప్పటికీ అన్ని విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెంచీలు లేక విద్యార్థులు నేలపై కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు పవన్ కుమార్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.





Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 29: కాటారం డివిజన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు, పోడు భూముల దందాపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల సంరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొందరు అటవీ శాఖ అధికారుల ప్రమేయంతో అటవీ భూములు నాశనమవుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్, అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ భూముల విక్రయాలు, ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని, కొందరు ఫారెస్ట్ అధికారులు, స్థానిక బ్రోకర్లు కలిసి ఇతర ప్రాంతాల వ్యక్తులకు భూములను విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ముఖ్యంగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను మాయమాటలు చెప్పి, బెదిరింపులకు పాల్పడి స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. మహాముత్తారం మండలం నిమ్మగూడెం పరిధిలో అటవీ భూముల అక్రమ విక్రయాలపై గతంలో సీసీఎఫ్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన చర్యలు కనిపించలేదని తెలిపారు. అలాగే మల్హర్ మండలంలోని కొయ్యూర్ రేంజ్‌లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇటీవల సస్పెన్షన్ చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యలు అన్ని చోట్ల కొనసాగించాలని కోరారు. అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయని, వర్షపాతం తగ్గుతూ కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ నిర్వహించి, సంబంధిత అధికారుల కాల్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల వివరాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులైన అధికారులు, బ్రోకర్లు, ఇతర సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని గిరిజనుల పోడు భూములకు, అటవీ సంపదకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చిదినేపల్లి, జూన్ 23: చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పారం గ్రామంలో నిన్న కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వర్షపు నీరు నిల్వ కావడంతో గ్రామపంచాయతీ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. గ్రామంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ సమీపంలోని పైపులను తొలగించి, సైడ్ డ్రైనేజీ కాలువలను పూర్తిగా శుభ్రం చేసి నీటి ప్రవాహాన్ని సక్రమంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కోరల్ల రాజయ్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, వార్డు సభ్యుడు మంతెన రాజశేఖర్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ ఇళ్ల చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


అదేవిధంగా గ్రామంలో సెంట్రల్ లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి, చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని సెంట్రల్ లైట్లను ఈరోజు మరమ్మతులు చేసి తిరిగి వెలిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ ముందంజలో ఉండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 23 : ఖరీఫ్-2026 సీజన్‌లో రైతులు అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో కాటారం మండలంలోని రేగులగూడెం, దామరకుంట క్లస్టర్లలో మంగళవారం సీడ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు వివిధ పంటలకు సంబంధించిన నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. 


రేగులగూడెం వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), దామరకుంట వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మాట్లాడుతూ రైతులు సకాలంలో విత్తనాలను సేకరించుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రగతిశీల రైతులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 23 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కాటారం, రేగులగూడెం, దామరకుంట రైతువేదికలలో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి "సీడ్ మేళ" కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాటారం గ్రామ సర్పంచ్  పంతకాని సడవలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  పంతకాని తిరుమల సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు  వేమునూరి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులకు వరి సాగుకు అనువైన 8 రకాల సన్న విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించి వాటిని రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఖరీఫ్ సీజన్‌ను విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




Blog Archive


www.medigaddatvnews.com