కాటారం, జూలై 29: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇంటిపై చెట్టు కూలిపడిన ఘటన చోటుచేసుకుంది. కాటారం మండలం చిదేనేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దంతాలపల్లి గ్రామంలో నాగురపు పోశమ్మ ఇంటిపై భారీ చెట్టు కూలిపడటంతో ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో పోశమ్మ ఇంట్లో నిద్రిస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా చెట్టు ఇంటిపై కూలిపడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చెట్టు కూలిన ధాటికి ఇంటి పైకప్పు, గోడలు తదితర భాగాలు దెబ్బతిని భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న దంతాలపల్లి సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించారు.
ఇంటి పరిస్థితిని, జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి బాధితురాలు నాగురపు పోశమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షానికి ఇల్లు దెబ్బతినడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితురాలికి తగిన నష్టపరిహారం అందేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనుకోని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్లను, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బౌతు ప్రభాకర్, నగరపు రజినీకాంత్, అంగడి వెంకటేశ్వర్లు, బాల్నే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.










