MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, జూన్ 3: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపుల యాజమాన్యాలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎంఎల్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ బందు సుజాత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఫర్టిలైజర్ మరియు విత్తనాల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కోరారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న షాపుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని, రైతులకు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లులు ఇవ్వాలని సూచించారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా, మరోవైపు ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం రైతాంగంపై అదనపు భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఒక బస్తా ఎరువు ధర రూ.2,300కు చేరుకుందని, వెంటనే ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఆత్కూరి శ్రీకాంత్, బుర్ర స్వాతి, క్రాంతి, రవి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా, సిరొంచ తాలూకా పరిధిలోని ఇంద్రానగర్ గ్రామంలో పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గ్రామానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలాల్లో మంటలు వేగంగా వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పొలాలు గ్రామానికి అత్యంత సమీపంలో ఉండటంతో మంటలు ఇళ్ల వరకు వ్యాపించే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఇంద్రానగర్ గ్రామం ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. అయితే గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై మోటార్లు ఆన్ చేసి నీటిని మంటలపై చల్లడంతో అగ్నిని అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికుల సమయస్ఫూర్తి, చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జూన్ 2:  తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ పితామహుడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి సాధించే దిశగా ప్రభుత్వం పనిచేయాలని కోరారు. కేవలం భౌగోళిక తెలంగాణతో సరిపెట్టకుండా, సామాజిక తెలంగాణ సాధించే వరకు టీఆర్పీ ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.


అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొంపల్లి గ్రామానికి చెందిన నడిగొట్టు కావ్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి తమ సానుభూతిని తెలియజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన శ్రీపతి జశ్వంత్ ఇటీవల చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి టీఆర్పీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాచారం గ్రామానికి చెందిన చీద్రాల మల్లమ్మ ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా కాసింపల్లి గ్రామానికి చెందిన మేకల సంపత్ తల్లి మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు గండు కరుణాకర్, ఇనుగాల ప్రణీత్, మామిడి శ్రీకాంత్, శ్రీపతి భద్రయ్య తదితరులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన యువకుడు జాదవ్ మాధవరావ్ దేశవ్యాప్తంగా మహా పాదయాత్ర చేపట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం, కుబీర్ గ్రామానికి చెందిన జాదవ్ మాధవరావ్, గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను ప్రారంభించారు. అలాగే నరేంద్ర మోదీ గారు నాలుగోసారి ప్రధానమంత్రి కావాలని, అఖండ భారత్ నిర్మాణం జరగాలని సంకల్పంతో ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలు, బడా చార్ ధామ్, చోటా చార్ ధామ్ యాత్రలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగే ఈ యాత్రలో సుమారు 15 వేల కిలోమీటర్లు నడవనున్నట్లు తెలిపారు. మే 11, 2026న ప్రారంభమైన ఈ పాదయాత్రకు ఇప్పటివరకు 22 రోజులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని, ఇప్పటివరకు కేవలం 10 రోజుల పాటు మాత్రమే నడవగలిగానని వెల్లడించారు. ఇవాళ ఉదయం 5:30 గంటలకు మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాత్రికి ఆసిరవెల్లి లేదా అంకిసా గ్రామంలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందన్నారు. సిరోంచాలో గంగా స్నానం చేసిన అనంతరం అక్కడి విఠలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని, బస, భోజనం వంటి అవసరాలను స్థానికులే స్వచ్ఛందంగా సమకూరుస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించినా వారు తిరస్కరిస్తూ సేవాభావంతో సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. “జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతా కీ జై” అంటూ తన యాత్రను కొనసాగిస్తున్న జాదవ్ మాధవరావ్‌కు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా మరియు అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐసా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐసా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బి. సుజాత మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రైవేటు పాఠశాలలు కనీస మౌలిక వసతులు లేకుండా, ప్లే గ్రౌండ్లు లేకుండా నడుస్తున్నాయని ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చుకుని పేద ప్రజల నుంచి నియంత్రణ లేని ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ జీవో నెంబర్ 91-2009కి విరుద్ధంగా “ఐఐటీ”, “జేఈఈ”, “ఒలంపియాడ్ కాన్సెప్ట్” వంటి పదాలతో బోర్డులు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆకర్షిస్తూ మోసపూరిత ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యాశాఖ నిర్ణయించిన సిలబస్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐసా జిల్లా అధ్యక్షురాలు బి. స్వాతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత జీవోలు 1, 16, 37, 42, 91లను పునరుద్ధరించి పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐసా విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు శాలువాతో మంత్రిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ మారగోని రాజబాపు గౌడ్, వైస్ చైర్మన్ మార్క రవీందర్ గౌడ్‌తో పాటు వీరగోని కిష్టయ్య గౌడ్, మారగోని బాలయ్య గౌడ్, మారగోని గణపతి గౌడ్, వీరగోని కిరణ్ గౌడ్, పల్లె శంకర్ గౌడ్, మారగోని వెంకటేష్ గౌడ్, మారగోని లింగయ్య గౌడ్, కారంగల రాజీర్ గౌడ్ పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మంథని, మే 31:మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్‌ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణ కోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో పుష్కరాలు నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు పుష్కరాలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామం నుంచి పుష్కర క్షేత్రాలకు చేరుకునేలా ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు బస్టాండ్లను ఆధునికీకరించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏర్పాటు చేసిన తరహాలోనే పుష్కరాల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని వెల్లడించారు. గత పదేళ్లలో కొత్త బస్సుల కొనుగోలు, నియామకాలు, డిపోల ఏర్పాటు వంటి అంశాలను విస్మరించారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టిందన్నారు. 

కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు, డిపోల ఏర్పాటు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 310 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగిస్తుండగా, బస్సులు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని చెప్పారు. ప్రతి గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే దిశగా బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. కార్మికులు అపోహలు నమ్మవద్దని సూచించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని బస్టాండ్‌లో రెండు అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రూ.74 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.19 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం బస్టాండ్ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశామని, కాళేశ్వరం దేవస్థాన అభివృద్ధిలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షగా ఉన్న పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటు త్వరలోనే సాకారం కానుందని, మంథని బస్టాండ్ ఆధునికీకరణతో పాటు పెద్దపల్లి బస్ డిపోను కూడా త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రి, ఇతర మంత్రులతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, రీజనల్ కరీంనగర్ మేనేజర్ రాజు, డిప్యూటీ ఆర్.ఎం.(ఎం) మల్లేశం, డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్, ఆర్డీఓ సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com