రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లో భారీగా యువత చేరారు. గ్రామ 8వ వార్డు మెంబర్ అంబటి కార్తీక్ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరగా, టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్దంపల్లి, దుంపిల్లపల్లి గ్రామాలకు చెందిన అంబటి కార్తీక్, ఎర్రబాటి హరీష్, వజ్జీరు కిరణ్, చలుకాని సైలని, బాబా, సిద్ధార్థ తదితరులకు రవి పటేల్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, అభ్యున్నతి, రాజ్యాధికారం కోసం టీఆర్పీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. గడపగడపకు వెళ్లి పార్టీ విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని కోరారు.
అంబటి కార్తీక్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నను ఆదర్శంగా తీసుకుని, రవి పటేల్ ఆధ్వర్యంలో బహుజనుల కోసం జరుగుతున్న పోరాటాలకు ఆకర్షితుడై టీఆర్పీలో చేరినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం సాధించే లక్ష్యంతో యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు గండు కరుణాకర్, జిల్లా కోశాధికారి జినుకల శ్రీను, భూపాలపల్లి మండల అధ్యక్షుడు మీసాల రాజు, సామల చంద్రశేఖర్, పిట్టల రాంబాబు, జినుకల శ్రీకాంత్, వేల్పుల దేవేందర్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.






