MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కాటారం మండల కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరూ సమాన పనికి సమాన వేతనం పొందుతున్నప్పటికీ, పెన్షన్‌ విషయంలో మాత్రం ఉద్యోగుల మధ్య వ్యత్యాసం చూపడం సరికాదన్నారు. 2003 సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని నిలిపివేసి, నూతన పెన్షన్‌ విధానమైన సీపీఎస్‌ను అమలు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఉద్యోగుల భవిష్యత్‌ భద్రతతో పాటు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులు సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానం అమలు చేయడం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాలకు భవిష్యత్‌ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఓపీఎస్‌ పునరుద్ధరణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు రాజు నాయక్‌, టీపీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు బొల్లం సతీష్‌, టీయూటీ మండల అధ్యక్షులు గురిసింగ విజయలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు పద్మజ, సుజాత, సంధ్యారాణి, వెంకటస్వామి, రవిప్రసాద్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: కాటారం మండల పరిధిలో 2026 వానాకాలం (ఖరీఫ్) డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రైతులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని కాటారం వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. సర్వే బృందం రైతుల పొలాల వద్దకు వచ్చిన సమయంలో సంబంధిత రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

పంట వివరాలు ఖచ్చితంగా నమోదు చేయించాలి.

రైతులు తమ పొలంలో సాగు చేసిన పంట రకం, విత్తిన తేదీ, సాగు విస్తీర్ణం తదితర వివరాలను సర్వే సిబ్బందికి ఖచ్చితంగా తెలియజేయాలని అధికారులు సూచించారు. పంటకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని పేర్కొన్నారు.

పలు ప్రయోజనాలకు సర్వే వివరాలే ఆధారం.

డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా నమోదు చేసిన పంట వివరాలు భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం, పంట బీమా పొందేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అలాగే బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడంలో కూడా ఈ వివరాలు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించేందుకు డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదైన పంట వివరాలు ప్రామాణికంగా ఉపయోగపడతాయని తెలిపారు.

తప్పులకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలి.

రైతులు సర్వే బృందం తమ పొలానికి వచ్చినప్పుడు సహకరించి, పంటకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వివరాల నమోదులో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సర్వే సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో మండలంలోని రైతులందరూ భాగస్వాములు కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం అశోక్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ శాఖ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మహేందర్‌ను గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడికి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మద్దులపల్లి సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, బుర్రి శివరాజ్, సాంబయ్య, శంకర్, బ్లాక్ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు అస్రార్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు, చంద్రుపల్లి సర్పంచ్ గురుసింగ బాపు, కుదురుపల్లి సర్పంచ్ సమ్మిరెడ్డి, కోట సమ్మన్న, సురేందర్, బాపురెడ్డి, కొట్టే రవీందర్, దుర్గయ్య, బానయ్య, సడవలి తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ శిరీషపై హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ వద్ద దారుణంగా కొట్టి అత్యాచారం చేసి హత్య చేయడాన్ని కుల సంఘాల జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైర్మన్ పీక కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సత్వర న్యాయం చేయాలి

ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నర్సింగ్ సిబ్బందిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శిరీష రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం అత్యంత ఘోరమైన చర్య అని పీక కిరణ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు మాట్లాడుతూ.. బాధితురాలి బట్టలు చిరిగిపోయి, ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు ఆమె మిత్రులు చెబుతున్నారని తెలిపారు. దీనికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మహిళల భద్రతపై ఆందోళన

ప్రజాసేవ చేసే నర్సులు, ఉద్యోగినుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లోనే కాకుండా వారి నివాసాల వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పోరాటం కొనసాగిస్తాం

‘జస్టిస్ ఫర్ శిరీష’ పేరుతో బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని పీక కిరణ్ స్పష్టం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: కాటారం మండలంలోని విలాసాగర్, కొత్తపల్లి, మద్దులపెల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.

విలాసాగర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా పూసల శశికాంత్, ఉపాధ్యక్షులుగా మురుకుంట్ల స్వామి, వీరబోయిన రాజసాగర్, ప్రధాన కార్యదర్శిగా తిపిరి రమేష్, కార్యదర్శులుగా అట్టేం సత్తయ్య, మంచినీళ్ల సంపత్, బోగే లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆరేళ్ల సమ్మయ్యను నియమించారు.

విలాసాగర్ యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా రాజునాల నాగరాజు, ఉపాధ్యక్షులుగా గుంజి ఆంజనేయులు, మంచినీళ్ల స్వామి, ప్రధాన కార్యదర్శిగా శెనిగల లక్ష్మణ్, కార్యదర్శిగా తిపిరి మహేష్, కోశాధికారిగా రాజీనాల అంజిని నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ తెలిపారు.

మద్దులపెల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ: గౌరవ అధ్యక్షుడిగా డోలి రామకృష్ణ, అధ్యక్షుడిగా మల్లారం మహేష్, ఉపాధ్యక్షులుగా టంగుటూరి శ్రావణ్, డోలి సతీష్, ప్రధాన కార్యదర్శులుగా గజ్జెల స్వామి, గోగు రాజబాపు, కార్యదర్శులుగా పాడి అశోక్, కొత్తపల్లి బాను ప్రకాష్, జనగాం కిష్టయ్య, కోశాధికారిగా పిట్టల రాజబాపును నియమించారు.

కొత్తపల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా అజ్మీరా నాగరాజు, ఉపాధ్యక్షుడిగా తుమ్మ అజయ్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం అభిషేక్ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి గడపగడపకు చేరేలా కృషి చేయాలని, గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీ సభ్యులు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వంశి వర్ధన్ రావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని 5వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణాన్ని ప్రారంభించే సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు శుభ ముహూర్తంలో భూమిపూజ చేపట్టారు. దీంతో తమ సొంతింటి కల నెరవేరబోతుండటంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగారం వాస్తవ్యులు, వాస్తు నిపుణులు లక్ష్మీరాజు చార్యులు, కేశబోయిన సమ్మయ్య చారి, జాదరావుపేట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కోట అశోక్, బొద్దుల సతీష్, బద్ది వెంకటేష్, పొరండ్ల రమేష్తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావడంతో 5వ వార్డులో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ పథకం ద్వారా సొంతింటి కల సాకారం అవుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం ఎక్స్‌రోడ్ వద్ద అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలవు దినాలను ఆసరాగా చేసుకుని నిర్మాణ పనులు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంగారం ఎక్స్‌రోడ్ పరిసరాల్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు నిబంధనల ప్రకారం అనుమతులు సాధ్యమా? ఒకవేళ అనుమతులు ఉంటే వాటిని ఎవరు మంజూరు చేశారు? నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను అధికారులు బహిరంగంగా వెల్లడిస్తారా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

పత్రికల్లో కథనాలు వచ్చినా.. ఆగని నిర్మాణాలు

ఇప్పటికే గంగారం ఎక్స్‌రోడ్ వద్ద జరుగుతున్న నిర్మాణాలపై పలుమార్లు పత్రికల్లో కథనాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ నిర్మాణ పనులు నిలిచిపోకుండా మరింత వేగంగా కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలోనే సమస్య అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలపై మరో నిర్మాణం చేపడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

“అడ్డుకునేవారు ఎవరూ లేరా?”

గంగారం ఎక్స్‌రోడ్ వద్ద వరుసగా నిర్మాణాలు వెలుస్తుండటంతో “అక్రమ నిర్మాణాలను అడ్డుకునే అధికారం ఉన్న అధికారులు ఎక్కడ?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లయితే వెంటనే పనులను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు గ్రామపంచాయతీ స్థాయిలో ఎలాంటి అనుమతులు ఇచ్చారు? ఇచ్చి ఉంటే ఏ భూమికి, ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారు? ప్రభుత్వ లేదా అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సర్పంచ్ అండదండలున్నాయనే ఆరోపణలు.

ఈ నిర్మాణాలకు గ్రామపంచాయతీ సర్పంచ్ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత సర్పంచ్ లేదా గ్రామపంచాయతీ అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. ఆరోపణలు నిజమా? కాదా? అన్నది తేల్చాల్సిన బాధ్యత అధికారులదేనని స్థానికులు పేర్కొంటున్నారు. ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత ప్రభావాలకు తావులేకుండా భూముల రికార్డులు, నిర్మాణ అనుమతులు, సంబంధిత పత్రాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని కోరుతున్నారు.

అధికారుల మౌనం ఎందుకు?

ఒకవైపు ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తుండగా.. మరోవైపు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం ఉన్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? సెలవు రోజుల్లో నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నా సంబంధిత సిబ్బంది ఎందుకు తనిఖీలు చేయడం లేదు? గతంలో వచ్చిన ఫిర్యాదులు, పత్రికా కథనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమగ్ర విచారణకు డిమాండ్.

గంగారం ఎక్స్‌రోడ్ వద్ద జరుగుతున్న నిర్మాణాలపై తక్షణమే సమగ్ర క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాలు ఏ భూమిలో జరుగుతున్నాయి? భూమి స్వభావం ఏమిటి? సంబంధిత వ్యక్తుల వద్ద పట్టాలు లేదా హక్కు పత్రాలు ఉన్నాయా? గ్రామపంచాయతీ నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగి ఉంటే వెంటనే గుర్తించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. గంగారం ఎక్స్‌రోడ్‌లో వరుసగా వెలుస్తున్న నిర్మాణాల వెనుక అసలు కథేంటి? నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నాయా? అధికారుల అనుమతులు ఉన్నాయా? ఆరోపణల్లో వాస్తవమెంత? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు ఇచ్చే సమాధానాలపై ఇప్పుడు స్థానికుల దృష్టి నెలకొంది.

Blog Archive


www.medigaddatvnews.com