MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, జూన్ 8: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని, ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫీజులు నిర్ణయించే విధంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) నాయకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐసా జిల్లా కార్యదర్శి బి. సుజాత మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఐసా జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ అధిక సంఖ్యలో రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని భావించే తల్లిదండ్రుల ఆశలను కొందరు ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయని ఆరోపించారు. ఐఐటీ, జేఈఈ, నీట్, ఫౌండేషన్ కోర్సులు వంటి పేర్లతో ఆకర్షణీయ ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థులను చేర్పించుకుని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి ధనార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలోని ప్రజల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి అందుబాటు ఫీజులను నిర్ణయించే విధంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని TS-RFJS-093 ‘మీ సేవ’ కేంద్రం వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కోంపల్లి గ్రామానికి చెందిన స్థానికులు, బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిరునామా మార్పు, యజమాన్య బదిలీ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

కోంపల్లి నుంచి భూపాలపల్లికి తరలింపు

2012లో కోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 3 వేల జనాభాకు సేవలందించేందుకు శ్రీ కర్రు రమేష్ పేరిట TS-RFJS-093 మీ సేవ కేంద్రం మంజూరైంది. అనంతరం 2014లో కేంద్రం వివాదాల్లో చిక్కుకుంది. కేంద్రాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా భూపాలపల్లి పట్టణంలోని ఎంఆర్వో కార్యాలయం ఎదురుగా తరలించడంతో అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ కేంద్రాన్ని నిలిపివేసినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా చిరునామా మార్పు?

మీ సేవ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం మంజూరైన గ్రామ పంచాయతీ పరిధిలోనే కొనసాగాలి. ఒకవేళ తరలించాల్సి వచ్చినా గరిష్టంగా ఒక కిలోమీటర్ పరిధిలో మాత్రమే అనుమతి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే 2022లో కోంపల్లి నుంచి భూపాలపల్లిలోని మంజూర్ నగర్‌కు కేంద్రాన్ని తరలించారని, ఇది అసలు కేంద్ర స్థలానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేదా గ్రామ సభ ఆమోదం లేకుండానే కేవలం సర్పంచ్ వ్యక్తిగత ఎన్‌ఓసీ ఆధారంగా మార్పు జరిగిందని పేర్కొన్నారు.

యజమాన్య బదిలీపైనా అనుమానాలు

2024లో ఈ కేంద్రాన్ని వేముల కుమార్‌కు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బదిలీ ప్రక్రియలో నిబంధనలను పూర్తిగా పాటించలేదని ఆరోపించారు. ఫ్రాంచైజీని రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు బాండ్ పత్రాల్లో పేర్కొనడం గమనార్హమని, ఫ్రాంచైజీల కొనుగోలు, అమ్మకాలను నిషేధించే నిబంధనలు ఉన్నప్పటికీ లావాదేవీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈడీఎం పాత్రపై అనుమానాలు

మంజూర్ నగర్‌లోని కేంద్రానికి సమీపంలోనే మరో గదిలో అదనపు కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM) పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాంకు లావాదేవీలను ఏసీబీ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

పూర్తి విచారణ వరకు నిర్ణయాలు వద్దు

ప్రస్తుతం మరోసారి చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం ఉందని, పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్‌ను స్థానికులు కోరారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఫిర్యాదుదారు: అంగోత్ తిరుపతి

సెల్: 7702544818

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


భూపాలపల్లి, జూన్ 7 : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను ఆకర్షించేందుకు తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రచార పత్రాలలో పాఠశాల పేర్లతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్ ఫౌండేషన్ వంటి పదాలను ఉపయోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పేర్లను చూపిస్తూ తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పేద ప్రజలను మోసం చేస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. జూన్ 12లోపు ఆయా పదాలను తొలగించి, సంబంధిత ఫ్లెక్సీలు, పాంప్లెట్లు, ప్రకటనలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలల ముందు ఐసా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి బందు సుజాతతో పాటు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం, జూన్ 7: మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన భూక్యా నరేష్, భూక్యా సురేష్‌లపై అటవీశాఖ అధికారులు విచక్షణారహితంగా దాడి చేశారని, సంబంధిత అధికారులపై హత్యాయత్నం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి న్యాయ విచారణ జరపాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం నిమ్మగూడెం గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ఆదివారం భూక్యా నరేష్ తన సొంత భూమిలో భూమి చదును పనులు చేపట్టేందుకు వెళ్లగా నిమ్మగూడెం బీట్ ఆఫీసర్ శ్రీకాంత్, రెడ్డిపల్లి బీట్ ఆఫీసర్ అఖిల్ రెడ్డి కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. నరేష్‌ను చంపే ఉద్దేశంతో పురుషాంగాలపై, కాళ్లపై కొట్టడంతో పాటు మెడపై నొక్కారని తెలిపారు. ఈ దాడిని అడ్డుకునేందుకు వచ్చిన భూక్యా సురేష్‌పై కూడా కర్రలతో దాడి చేసి, శరీరంలోని పలు భాగాలపై తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. వారి అరుపులు విని సమీపంలోని రైతులు, గ్రామస్తులు వచ్చి విడిపించారని తెలిపారు. దాడి కారణంగా ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకోగా, గ్రామస్తులు పోలీసుల సహకారంతో అంబులెన్స్‌లో భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఇదే సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. అయితే ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోందని పీక కిరణ్ విమర్శించారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, సంబంధిత అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా ఎస్పీ, ఎస్సీ-ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రాజు, మండల కోఆర్డినేటర్ పుల్యాల సురేష్, వావిళ్ల సడవలి, గోల్కొండ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
పలిమెల, జూన్ 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ముకునూరు గ్రామానికి చెందిన దుగ్గిరాల రంగారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ముకునూరు గ్రామానికి చెందిన ఎర్రవెల్లి వసంతరావు తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తిప్పనపల్లి ముత్తయ్యను సైతం పరామర్శించి మెరుగైన వైద్య చికిత్స పొందాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం తన బాధ్యత అని ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

రామగుండం, జూన్ 7: కుల, మతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుతూ సమతా ఫౌండేషన్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచింది. రామగుండం 33వ డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ నిరుపేద ముస్లిం యువతి వివాహానికి సమతా ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులతో వివాహ ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న సమతా ఫౌండేషన్ చైర్మన్ డా. దుర్గం నగేష్ స్పందించి, వివాహానికి అవసరమైన 25 కిలోల బియ్యంతో పాటు రూ.5 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. దుర్గం నగేష్ మాట్లాడుతూ, పేదరికం ఎవరికీ శాపంగా మారకూడదని, ఆనంద క్షణాలను పంచుకోవడంలో ఆర్థిక సమస్యలు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా మానవత్వమే సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చెప్పారు. సమతా ఫౌండేషన్ అందించిన సహాయంపై పెళ్లికూతురు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో ఆదుకున్న డా. దుర్గం నగేష్, ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల, మాసూమ్ అలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ, సమతా ఫౌండేషన్ ద్వారా డా. దుర్గం నగేష్, ప్రమీల దంపతులు అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. నిరుపేద కుటుంబాల వివాహాలకు, అవసరమైన వారికి అందిస్తున్న సహాయం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నాసా సునీత, గన్న మహేష్, భూస్పాక రామచందర్, బెక్కం నిఖిల్ సాయి, చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, జిమ్మిడి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 6: కాటారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ పనులను శనివారం బీజేపీ కాటారం మండల శాఖ నాయకులు పరిశీలించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేసి దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కాటారం పట్టణంలో ప్రస్తుతం కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారం నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని తెలిపారు. గతంలో ఇదే కారణంగా ఓ మహిళ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్వంత మండలంలోనే మార్కెట్ నిర్మాణం ఆలస్యమవుతుండటం సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ కాటారం మండల శాఖ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి సునీల్, బొంతల రవీందర్, జిల్లా నాయకులు డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. 



Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com