Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహముత్తారం, జూలై 4 (న్యూస్): మహముత్తారం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని కాటారంకు తరలించడం అన్యాయమని, ఇందుకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం మహముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వార్డెన్ స్వయంగా నిర్ణయం తీసుకుని రాత్రికి రాత్రే హాస్టల్ను కాటారంకు తరలించడం తీవ్రంగా ఖండించారు. ఈ చర్య వల్ల మారుమూల గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా మహముత్తారంలోని బీసీ బాలుర వసతి గృహం పేద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభ్యాసానికి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రస్తుతం జడ్పీ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాస్టల్ను తరలించడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఇటీవల 45 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని, హాస్టల్ తరలింపుతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని బీసీ బాలుర వసతి గృహాన్ని తిరిగి మహముత్తారానికే తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ అజ్మీర పూల్ సింగ్, కో-కన్వీనర్ రామగిరి రాజు, మండల చైర్మన్ ముక్కెర వెంకటస్వామి గౌడ్, మండల కన్వీనర్ లింగమల సడవాలిరావు తదితరులు పాల్గొన్నారు.











