జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం జిల్లాకు చెందిన సాంస్కృతిక, కోలాటం, భజన కళాకారులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా కళలను నమ్ముకుని జీవిస్తున్న తమను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
కళాకారులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ సౌకర్యం, పెన్షన్, కళాకారుల భృతి, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. జిల్లాలోని దేవాలయాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు కళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికారం సాధించిన అనంతరం కళాకారుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కళలు, కళాకారులు తెలంగాణ సమాజానికి గర్వకారణమని, వారికి తగిన గౌరవం, అవకాశాలు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కళాకారుల రాష్ట్ర నాయకులు కుడుముల కుమార్, జాతీయ అధ్యక్షుడు వీరభద్ర స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు కుంట్ల ఉప్పలయ్య, మహిళా అధ్యక్షురాలు రజిత కీసర, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మయ్య, జనగాం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బందెర రవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కుడుముల రామా తదితరులతో పాటు జిల్లా కోలాటం, భజన కళాకారులు పాల్గొన్నారు.






