MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహాముత్తారం మండల అధ్యక్షుడు రామగిరి రాజు అన్నారు. ఈ సమస్యపై ప్రజావాణి ద్వారా సంబంధిత అధికారులకు వినతి అందజేశారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజలు, చిన్నారులు నిత్యం సంచరించే ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను కొనసాగించడం సమంజసం కాదన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎలాంటి ఆలస్యం చేయకుండా తొలగించి, సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని రామగిరి రాజు, గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు లింగమళ్ల సడవలి రావు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా, ముందుగానే అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ పోటీలో భాగంగా ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. భూపాలపల్లి అంబేద్కర్ కూడలి వేదికగా ఇరు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణం కావడం తగదన్నారు. ప్రజల మధ్య అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులారా.. భూపాలపల్లిలో మీ రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్‌ప్లాన్ వంటి హామీలను నెరవేర్చాలని కోరారు.

బీఆర్ఎస్ గత పాలనపై సమాధానం చెప్పాలి.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యల పేరుతో రోడ్లపైకి రావడం విడ్డూరంగా ఉందని రవి పటేల్ విమర్శించారు. గత పాలనలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పెన్షన్ల విషయంలో పేదలు ఎదుర్కొన్న సమస్యలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఎన్నికల సమయంలో రాజకీయ పావులుగా ఉపయోగించుకోవడం రెండు పార్టీలు మానుకోవాలని సూచించారు. బహుజనులు తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి కోసం ఐక్యంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ అధికార సాధన కోసం పోరాడుతుందని రవి పటేల్ స్పష్టం చేశారు. భూపాలపల్లి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలను చట్టపరంగా నియంత్రించి ప్రజలకు రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, సురేందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

అన్నారం: కాళేశ్వరం ఎక్స్‌ రోడ్డు వద్ద మూలమలుపులో ఉన్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కాటారం డివిజన్‌ దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం మాదేపూర్‌ మండలం అన్నారం గ్రామ సర్పంచ్‌ నీర్ల ప్రభాకర్‌ నేతృత్వంలో దళిత సంఘాల నాయకులు మాదేపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్నారం గ్రామంలో నెలకొల్పిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు తొలగించేందుకు లేదా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహానికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కోరారు. విగ్రహాన్ని తొలగించే కుట్రకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులో పాత్రధారులు బయటకు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఘటన వెనుక సూత్రధారులు దుద్దిళ్ల కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ఈ విషయంపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి అంబేడ్కర్‌ విగ్రహ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్‌ నీర్ల ప్రభాకర్‌, సీనియర్‌ దళిత నాయకులు వేమూరి జక్కన్న, సంపత్‌ మహారాజ్‌, గోల్కొండ కిరణ్‌, జోడు శ్రీనివాస్‌, జక్కు శ్రావణ్‌, దిల్లీ రాజు, మహిళా నాయకురాళ్లు చంద్రకళ, అరుణ, కొండ గొర్ల వెంకటస్వామి, బొడ్డు రాజబాబు, అటుకాపురం మల్లేష్‌, అటుకాపురం రాజేష్‌, పాలిక గణపతి, వేమూరి తిరుపతి రెడ్డి, పానుగంటి సంతోష్‌, పెంచిక గట్టయ్య, చుదారి పోచయ్య, పెంచిక మహేష్‌, పాగే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీల్లో కాళేశ్వరం గ్రామానికి చెందిన బాలిక కోల శాన్వి ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధించింది. తెలంగాణ యోగా అసోసియేషన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కోల జయసుధ–దుర్గరాజ్ దంపతుల కుమార్తె కోల శాన్వి అండర్‌–8 నుంచి 10 సంవత్సరాల విభాగంలో పాల్గొంది. పోటీల్లో అద్భుతమైన యోగాసనాలను ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. చిన్న వయసులోనే జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం పట్ల బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన బాలిక జిల్లా స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా కోచ్ వవిల్ల కిష్టయ్య కోల శాన్విని అభినందించారు. కాగా, ఈ నెల 11న కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు శాన్వి ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సకినారపు వెంకయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ వేల్పుల సరిత పరామర్శించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని కలిసిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని సర్పంచ్ సరిత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, నాయకులు సురేందర్, బానయ్య, సమ్మయ్య, బాపు, రవి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నిన్న కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద చేసిన వ్యాఖ్యలను ఐదు మండలాల కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం కాటారం సబ్‌డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెప్పల దేవేందర్‌రెడ్డి మాట్లాడారు. పుట్ట మధు ఐదేళ్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లు పెద్దపల్లి చైర్మన్‌గా పనిచేసి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పుట్ట మధు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. శ్రీధర్‌బాబు కుటుంబం చేసిన మేలును మరిచి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఒకసారి అధికారం ఇస్తే అవినీతికి పాల్పడ్డారని, ఇల్లు లేని స్థాయి నుంచి రాజగృహాలు, వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వందల కోట్ల అవినీతికి పాల్పడింది పుట్ట మధు కాదా అని ప్రశ్నించారు. ఆయన తల్లి పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల బ్లాక్‌మనీని నిర్వహించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుంటే, అభివృద్ధి జరగలేదని పుట్ట మధు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేస్తున్న అభివృద్ధిని కళ్లుతెరిచి చూడాలని సూచించారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఏమిటో, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయని అభివృద్ధి ఏమిటో పుట్ట మధు చెప్పాలని, అంబేద్కర్‌ చౌక్‌ వద్ద బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ నాయకులు సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రైతు భరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయని రేషన్‌ కార్డుల పంపిణీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ధైర్యం తమకు ఉందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. జాడి కవిరాజు, మంథని మధుకర్‌, రేవెల్లి రాజబాబు, గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసుల్లో పుట్ట మధు ప్రమేయంపై ప్రశ్నలు సంధించారు. ఈ కేసులపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్ల అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే పాలించడం చేతకాకపోయిన పుట్ట మధుకు శ్రీధర్‌బాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నాలుగున్నరేళ్లు అసెంబ్లీలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడని పుట్ట మధు ఇప్పుడు ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. తెలంగాణలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఏకైక ప్రజాప్రతినిధి పుట్ట మధు కాదా అని ప్రశ్నించారు. హత్యల్లో తన బంధువులు, ముఖ్య అనుచరులు పాల్గొన్నారనే ఆరోపణలపై నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న మంథని నియోజకవర్గంలో హత్యా సంస్కృతిని తీసుకొచ్చిన పుట్ట మధు, మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో ఐదు మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులతో పాటు రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్‌ సభ్యుడు దండు రమేష్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంగోతు సుగుణ, జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్నారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పంతకాని తిరుమల, జిల్లా కిసాన్‌ అధ్యక్షుడు వంశవర్ధన్‌రావు, మంథని నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు చీమల సందీప్‌, మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, కాటారం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చిట్టూరి మహేష్‌గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం నాయకుడు కిషన్‌ నాయక్‌, గుడాల శ్రీను, కాటారం మండల సీనియర్‌ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ముందుగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయినులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కాటారం కేజీబీవీ ప్రిన్సిపాల్‌ చల్ల సునీత పాఠశాలలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఘనంగా సత్కరించారు. కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు ఎన్‌. శిరీష, పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని జి. నళిని, శారీరక విద్య ఉపాధ్యాయిని రాజేశ్వరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించారు. వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు తమ గురువుల గొప్పతనాన్ని వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గురువుల సేవలను కొనియాడుతూ పాటలు పాడారు. నృత్యాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయుల ప్రాధాన్యత, విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్రను వివరిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రిన్సిపాల్‌ చల్ల సునీత రచించిన ‘గురువు గారి గొప్పదనం’ పాటను ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయ బృందం కలిసి ఆలపించారు. గురువు యొక్క గొప్పతనం, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను చాటిచెప్పేలా ఈ పాట సాగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ చల్ల సునీత మాట్లాడుతూ.. గురువు దైవంతో సమానమని అన్నారు. విద్యార్థుల జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసేది గురువులేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను, సూచనలను విద్యార్థినులు శ్రద్ధగా ఆలకించాలని సూచించారు. కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులను సత్కరించడం, విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉపాధ్యాయ బృందం కలిసి పాట ఆలపించడం వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చల్ల సునీతతో పాటు విజయ, శిరీష, నళిని, కవిత, శ్రీలత, సుజాత, స్వప్న, సరిత, అరుణ, మణిమాల, రాజమణి, మౌనిక, రాజేశ్వరి, శ్రావ్య, లక్ష్మి, రిబ్కా తదితర ఉపాధ్యాయినులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.





Blog Archive


www.medigaddatvnews.com