జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు ఫెర్టిలైజర్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వివరాల ప్రకారం.. యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.267 ఉండగా, కొన్ని దుకాణాల్లో రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే రూ.1,350 ధర ఉండాల్సిన డీఏపీని రూ.1,850 వరకు విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. అధికారిక యాప్ ద్వారా బుక్ చేసుకుని కొనుగోలు చేసినప్పటికీ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఒక్కో దుకాణంలో ఒక్కో ధర.
ఎరువులతో పాటు పంటలకు వినియోగించే పురుగుమందులు, స్ప్రే మందులను కూడా ఒక్కో దుకాణంలో ఒక్కో ధరకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ధరలపై ప్రశ్నించినప్పుడు కొందరు వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తనిఖీలు చేపట్టాలి.
ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. ప్రతి ఫెర్టిలైజర్ దుకాణంలో అన్ని ఉత్పత్తుల ధరలు స్పష్టంగా కనిపించేలా రేట్ బోర్డులు ఏర్పాటు చేయించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆయన అధికారులను కోరారు.









