MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మేడిపల్లి: మేడిపల్లి ఆశ్రమ పాఠశాల కాంపౌండ్‌వాల్‌, మరుగుదొడ్ల నిర్మాణ పనులపై గ్రామసభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో నాన్‌లోకల్‌ వారికి పనులు అప్పగించాలన్న గత తీర్మానాన్ని రద్దు చేశారు. గ్రామపంచాయతీకి చెందిన గాదె రామకృష్ణకు పనులు అప్పగించేందుకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, ఏడుగురు వార్డు సభ్యుల ఆమోదంతో సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. రేపటి నుంచే కాంపౌండ్‌వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్‌ కోరారు. తనపై నమ్మకంతో పనులు అప్పగించిన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మహాముత్తారం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజూ సుమారు 150 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తున్నారని కుల ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ తెలిపారు. ప్రస్తుతం ఒక్క వైద్యురాలు మాత్రమే సేవలందిస్తుండటంతో రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో రోగులను ఒక్క వైద్యురాలు పరీక్షించాల్సి రావడంతో వైద్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. గ్రామీణ ప్రజలకు పీహెచ్‌సీ ప్రధాన ఆధారం కావడంతో ప్రభుత్వం తక్షణమే మరో వైద్యుడిని నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రోగుల సంఖ్యకు అనుగుణంగా నర్సింగ్, ఇతర వైద్య సిబ్బందిని కూడా పెంచాలని కోరారు. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలని పీక కిరణ్ కోరారు. ఈ సమావేశంలో జేఏసీ జిల్లా కోకన్వీనర్ రామగిరి రాజు, మండల కన్వీనర్ లింగమళ్ల సడవలిరావు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాధరావుపేట గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నూతన ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ పరిధిలోని 3వ వార్డుకు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు బెల్లంపల్లి రాజు నూతన ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి సువర్ణ–రమేష్, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ అనుముల సంపత్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి పనులను ప్రారంభించిన లబ్ధిదారుడు బెల్లంపల్లి రాజుకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని నూతన గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొని నూతన ఇంటి నిర్మాణానికి శుభాకాంక్షలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహాముత్తారం మండల అధ్యక్షుడు రామగిరి రాజు అన్నారు. ఈ సమస్యపై ప్రజావాణి ద్వారా సంబంధిత అధికారులకు వినతి అందజేశారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజలు, చిన్నారులు నిత్యం సంచరించే ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను కొనసాగించడం సమంజసం కాదన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎలాంటి ఆలస్యం చేయకుండా తొలగించి, సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని రామగిరి రాజు, గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు లింగమళ్ల సడవలి రావు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా, ముందుగానే అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ పోటీలో భాగంగా ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. భూపాలపల్లి అంబేద్కర్ కూడలి వేదికగా ఇరు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణం కావడం తగదన్నారు. ప్రజల మధ్య అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులారా.. భూపాలపల్లిలో మీ రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్‌ప్లాన్ వంటి హామీలను నెరవేర్చాలని కోరారు.

బీఆర్ఎస్ గత పాలనపై సమాధానం చెప్పాలి.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యల పేరుతో రోడ్లపైకి రావడం విడ్డూరంగా ఉందని రవి పటేల్ విమర్శించారు. గత పాలనలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పెన్షన్ల విషయంలో పేదలు ఎదుర్కొన్న సమస్యలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఎన్నికల సమయంలో రాజకీయ పావులుగా ఉపయోగించుకోవడం రెండు పార్టీలు మానుకోవాలని సూచించారు. బహుజనులు తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి కోసం ఐక్యంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ అధికార సాధన కోసం పోరాడుతుందని రవి పటేల్ స్పష్టం చేశారు. భూపాలపల్లి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలను చట్టపరంగా నియంత్రించి ప్రజలకు రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, సురేందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

అన్నారం: కాళేశ్వరం ఎక్స్‌ రోడ్డు వద్ద మూలమలుపులో ఉన్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కాటారం డివిజన్‌ దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం మాదేపూర్‌ మండలం అన్నారం గ్రామ సర్పంచ్‌ నీర్ల ప్రభాకర్‌ నేతృత్వంలో దళిత సంఘాల నాయకులు మాదేపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్నారం గ్రామంలో నెలకొల్పిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు తొలగించేందుకు లేదా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహానికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కోరారు. విగ్రహాన్ని తొలగించే కుట్రకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులో పాత్రధారులు బయటకు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఘటన వెనుక సూత్రధారులు దుద్దిళ్ల కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ఈ విషయంపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి అంబేడ్కర్‌ విగ్రహ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్‌ నీర్ల ప్రభాకర్‌, సీనియర్‌ దళిత నాయకులు వేమూరి జక్కన్న, సంపత్‌ మహారాజ్‌, గోల్కొండ కిరణ్‌, జోడు శ్రీనివాస్‌, జక్కు శ్రావణ్‌, దిల్లీ రాజు, మహిళా నాయకురాళ్లు చంద్రకళ, అరుణ, కొండ గొర్ల వెంకటస్వామి, బొడ్డు రాజబాబు, అటుకాపురం మల్లేష్‌, అటుకాపురం రాజేష్‌, పాలిక గణపతి, వేమూరి తిరుపతి రెడ్డి, పానుగంటి సంతోష్‌, పెంచిక గట్టయ్య, చుదారి పోచయ్య, పెంచిక మహేష్‌, పాగే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీల్లో కాళేశ్వరం గ్రామానికి చెందిన బాలిక కోల శాన్వి ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధించింది. తెలంగాణ యోగా అసోసియేషన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కోల జయసుధ–దుర్గరాజ్ దంపతుల కుమార్తె కోల శాన్వి అండర్‌–8 నుంచి 10 సంవత్సరాల విభాగంలో పాల్గొంది. పోటీల్లో అద్భుతమైన యోగాసనాలను ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. చిన్న వయసులోనే జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం పట్ల బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన బాలిక జిల్లా స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా కోచ్ వవిల్ల కిష్టయ్య కోల శాన్విని అభినందించారు. కాగా, ఈ నెల 11న కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు శాన్వి ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.

Blog Archive


www.medigaddatvnews.com