Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, ఆగస్టు 19: ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలు పేద లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ అన్నారు. నిబంధనలు సవరించకపోతే లబ్ధిదారుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయం ప్రస్తుత నిర్మాణ ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. సిమెంట్, ఇనుము, కూలీల ధరలు పెరిగిన నేపథ్యంలో నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటి వైశాల్య పరిమితిని 1000 చదరపు అడుగులకు పెంచాలని కోరారు. అరకొర ఆర్థిక సాయంతో పేదలు అప్పులు చేసి ఇళ్లు నిర్మించాల్సి వస్తోందన్నారు.ఈ సమస్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు పీక కిరణ్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి నిబంధనలు సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
భూపాలపల్లి, ఆగస్టు 19: రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం భూపాలపల్లిలోని సింగరేణి ఉద్యోగుల సంఘం బాతాల రాజన్న భవన్లో ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న ఆదివాసీలు, ఉద్యమకారులు, రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూఏపీఏ చట్టాన్ని రద్దు చేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కామెరా గట్టయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, ప్రజా ఫ్రంట్ దుబాసి పార్వతి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రాదండి దేవేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య నాయకుడు అయిత బాపుతో పాటు పలువురు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహాముత్తారం, ఆగస్టు 19: మహాముత్తారం మండలం కోనంపేటలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు.ప్లాంట్లో 60–80 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 16 మందితోనే పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సెలవులు, ఓవర్టైమ్ వేతనాలు చెల్లించడం లేదని, జీతాల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ, మెడిక్లెయిమ్, పెట్రోల్ అలవెన్సుల పేరుతో రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు.ఈ సమస్యపై జూలై 27, ఆగస్టు 3, ఆగస్టు 17న జిల్లా కలెక్టర్కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతస్థాయి విచారణ జరిపి న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. భూపాలపల్లి టౌన్ ఎల్బీనగర్కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కుమారస్వామి, నందిగామకు చెందిన ప్రభాకర్ గౌడ్తో పాటు పలువురు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా టీఆర్పీలో చేరుతున్నట్లు నూతన నాయకులు తెలిపారు. తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలు తమను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.పటేల్ వనజ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో మరింత మంది ప్రజలు టీఆర్పీలో చేరి రాజ్యాధికారం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాధికారం సాధించేందుకు పార్టీ కృషి చేస్తోందన్నారు.రవి పటేల్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణీత్, సంతోష్, శ్రీకాంత్, రాంబాబు తదితరులు, టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, ఆగస్టు 19: మహా ముత్తారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండగొర్ల బాపు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సభ్యులు చర్చించారు.గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, మొక్కల సంరక్షణతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత పొందిన 15 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేస్తామని, మధ్యవర్తులు, సిఫార్సులు అవసరం లేదని తెలిపారు.అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహాముత్తారం, ఆగస్టు 18: గ్రామపంచాయతీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించారని ఆరోపిస్తూ బీజేపీ మండల ఉపాధ్యక్షుడు లింగమల్ల సడవలిరావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మార్క బాపు సొంత భూమికి ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని ఆరోపించారు.ప్రజలకు ఉపయోగపడని ప్రాంతంలో, ఇరువైపులా చెట్లు మాత్రమే ఉన్న చోట సీసీ రోడ్డు నిర్మించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాల్సి ఉండగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రోడ్లు వేయడం సరికాదన్నారు.గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన తీర్మానాలపై సంతకాలు చేయవద్దని, సంబంధిత బిల్లులను చెల్లించవద్దని సడవలిరావు కోరారు. ఇప్పటికే నిర్మించిన సీసీ రోడ్డుపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం ప్రజల అవసరాలకే వినియోగించాలని ఆయన కోరారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, ఆగస్టు 18: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. తిరుపతి పిలుపునిచ్చారు. మంగళవారం డీటీఎఫ్ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా మూడో దశలో నిర్వహిస్తున్న జిల్లా కేంద్రం ధర్నాకు జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడంతో పాటు ఆరో డీఏను కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు.గతంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీవో నంబర్ 190ను వెంటనే అమలు చేయాలని కోరారు. జీవో నంబర్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గురుకుల పాఠశాలల పనివేళలను ఉదయం 9 గంటలకు మార్చాలని, ప్రతి గురుకుల పాఠశాలలో సంరక్షకులు, వసతి గృహ నిర్వాహకులను నియమించాలని కోరారు. మోడల్ పాఠశాలల్లోనూ వసతి గృహ నిర్వాహకులను నియమించాలని, 010 పద్దు కింద వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, అతిథి ఉపాధ్యాయులకు కనీస వేతన శ్రేణిని అమలు చేయాలని, కేజీబీవీ పాఠశాలల్లో రాత్రి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మరుసటి రోజు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఉపాధ్యాయుల మిగతా సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు రాజు నాయక్, ప్రధాన కార్యదర్శి మోహన్ నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ నాయక్, జిల్లా కౌన్సిలర్ రాజన్నతో పాటు పనిందర్, నర్సన్న, కవిత తదితరులు పాల్గొన్నారు.