MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహోన్నత యోధుడని అన్నారు. సామాన్య ప్రజలను ఏకం చేసి, అప్పటి సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపారని కొనియాడారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా పోరాటాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కుల, ఆర్థిక, సామాజిక వివక్షలకు తావులేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయడమే సర్వాయి పాపన్న గౌడ్‌కు అందించే నిజమైన నివాళి అని రవి పటేల్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, గౌరవప్రదమైన జీవితం ప్రతి పేదవాడికి అందేలా పోరాడుతామని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడితే, నేడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సామాజిక న్యాయం, సమానత్వం, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతోందని రవి పటేల్ అన్నారు. బహుజనుల హక్కుల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: ఈ నెల 19న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట్ల ప్రవీణ్ రానున్న నేపథ్యంలో జిల్లాలోని దళితులు, దళిత సంఘాల నాయకులు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని జేఏసీ చైర్మన్ పీక కిరణ్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశంలో కమిషన్ చైర్మన్, సభ్యులు, పలువురు అధికారులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్, ప్రమోషన్లు, దళితులపై జరుగుతున్న కుల వివక్ష, అంటరానితనం, సామాజిక వివక్ష వంటి అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఆధిపత్య కులాల పెత్తనం, దళితులపై వివక్ష, అలాగే ఆయా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించాలని పీక కిరణ్ కోరారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దళిత వర్గాలకు సంబంధించిన సమస్యలను కమిషన్ చైర్మన్, సభ్యుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల జిల్లా కన్వీనర్ అజ్మిర పూల్‌సింగ్, జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 17: నాటుసారాయి తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కె. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హెచ్. దత్తురాజ్ గౌడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి బి. కిరణ్ ఆదేశాల మేరకు కాటారం ఎక్సైజ్ స్టేషన్, ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ వరంగల్, జిల్లా టాస్క్‌ఫోర్స్, భూపాలపల్లి స్టేషన్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మహాముత్తారం మండలంలోని కోర్లకుంట, దొబ్బలపాడు, మలహర్ మండలంలోని ఎడ్లపల్లి, కొండంపేట, కాటారం మండలంలోని గంగారం, చింతకాని గ్రామాల్లో నాటుసారాయి తయారీ స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 10 మందిపై కేసులు నమోదు చేసి, 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అధికారులు 46 లీటర్ల నాటుసారాయి, 20 కిలోల చక్కెర, 2 కిలోల డ్రై ఈస్ట్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన 1,250 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా నాటుసారాయి వల్ల కలిగే అనర్థాలు, ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావంపై అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాటుసారాయి తయారు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా లేదా విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో కాటారం ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాదావత్ కిష్టయ్య, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజ సమ్మయ్య, ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, చంద్రశేఖర్, భూపాలపల్లి ఎస్‌ఐ ఎస్‌కే. రబ్బానీతో పాటు హెడ్ కానిస్టేబుల్ గణేష్, కానిస్టేబుళ్లు కృష్ణ నాయక్, శ్రీనాథ్, హుస్సేన్, కుమార్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై ఆదివారం రాత్రి జరిగిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి భూపాలపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. జర్నలిస్టుపై దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. గతంలో చిట్యాల మండలంలో బీసీ యువకుడిపై దాడి జరిగినప్పుడు బాధితుడికి అండగా నిలిచి న్యాయం కోసం పోరాడామని, ప్రస్తుతం దళిత జర్నలిస్టుపై జరిగిన దాడిని కూడా అదే విధంగా ఖండిస్తున్నామని తెలిపారు. కులం, వర్గం, రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలబడి న్యాయం కోసం పోరాడటమే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే జర్నలిస్టులపై భౌతిక దాడులు చేయడం ప్రజల సమాచార హక్కుపై, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రతను కాపాడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమని పేర్కొంటూ.. జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తుందని రవి పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా వ్యవసాయ శాఖ విభాగం అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, శ్రీకాంత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: శక్తి పేరుతో ఐటీఐ, పాలిటెక్నిక్, ఏటీసీ కళాశాలలను విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్‌ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగే రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కాటారం మండలం కొత్తపల్లి శివారులోని పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట జీఓ 97కు వ్యతిరేకంగా విద్యార్థినీ, విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీజేపీ కాటారం మండల శాఖ తరఫున రంజిత్‌కుమార్‌ మద్దతు తెలిపారు. విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి అత్యవసరంగా జీఓ 97ను తీసుకొచ్చారని ఆరోపించారు. శక్తి పేరుతో ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఏటీసీలను విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జీఓపై విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు జీఓ 97పై ఉన్న సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు. పాలిటెక్నిక్‌ విద్యను ఏఐసీటీఈ పరిధిలోనే కొనసాగించాలని, విద్యార్థులకు ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే విధానాన్ని కొనసాగించాలని అన్నారు. శక్తి పేరుతో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని రంజిత్‌కుమార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఓ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంరక్షణపై విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వృక్ష సంరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలోని తల్లి వృక్షాన్ని గుర్తించి విద్యార్థినీలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు తల్లి వృక్షానికి పూజ చేసి, అనంతరం వృక్షాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. వృక్షాలు మానవాళికి అందించే ప్రాణవాయువు, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్రను గుర్తుచేస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి, పెంచి పెద్దవిగా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో వివరించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలందరూ మొక్కలను పెంచుతూ, వృక్షాలను సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీతతో పాటు ఉపాధ్యాయులు విజయ, నళిని, శిరీష, సుజాత, మణిమాల, అరుణ, రాజమణి, కవిత, శ్రీలత, స్వప్న, సరిత, మౌనిక, శ్రావ్య, లక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినీలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని వృక్ష సంరక్షణపై తమ నిబద్ధతను చాటారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి జిల్లా: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే పత్రికారంగంపై, సమాజ హితమే ధ్యేయంగా పనిచేసే విలేఖరులపై భౌతిక దాడులకు తెగబడటం పత్రికా స్వేచ్ఛను నొక్కేసే కక్షపూరిత చర్య అని తెలంగాణ శ్రామిక పాత్రికేయుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్నల సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో విధి నిర్వహణలో ఉన్న విలేఖరిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తెస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే విలేఖరులకు రక్షణ లేకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు సేకరించే విలేఖరులపై ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థనే సవాలు చేయడమని పేర్కొన్నారు. చిట్యాల మండలంలో విలేఖరిపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విలేఖరులపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత విలేఖరికి పూర్తి వైద్య సహాయం అందించడంతో పాటు తగిన రక్షణ కల్పించాలని కోరారు. భవిష్యత్తులో విలేఖరులపై ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈర్నల సుమన్ హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.

Blog Archive


www.medigaddatvnews.com