MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070
Total Pageviews
Trending Now
TRENDING NOW
కాటారం, జూలై 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి మండల బీజేపీ అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ నాయకత్వం వహించారు. దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించేందుకు నాయకులు బయలుదేరుతున్న సమయంలో కాటారం పోలీసులు వారిని అడ్డుకుని ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో కాటారం మండల కేంద్రంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను, నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని పాగె రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, మహాముత్తారం మండల బీజేపీ అధ్యక్షుడు మేడిపల్లి పూర్ణచందర్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
భూపాలపల్లి : విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఐసా (ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి, జిల్లా కార్యదర్శి బంధు సుజాత డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాట హక్కును హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తుతో పేపర్ లీకేజీలు చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. లాఠీచార్జి ఘటనపై కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమగ్ర ప్రక్షాళన చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల పోరాట హక్కును కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని, లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి విద్యాశాఖలో ప్రక్షాళన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
కాటారం, జయశంకర్ భూపాలపల్లి: రానున్న సీజన్లో ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ సూచనల మేరకు కాటారం మండల రైతులు పంట మార్పిడికి శ్రీకారం చుట్టారు. వరి సాగుకు బదులుగా పప్పుదినుసులు, కూరగాయల సాగును చేపడుతున్నారు. గురువారం వ్యవసాయ శాఖ అధికారుల బృందం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను పరిశీలించింది. తక్కువ నీటితో సాగు చేయగల పప్పుదినుసులు, కూరగాయల ద్వారా నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు మంచి దిగుబడులు, మార్కెట్లో మెరుగైన ధరలు పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి బాపు రావు, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ కంటె, కాటారం మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ, ఏఈఓలు పి. శ్రీకన్య, జె. రాజన్న, రైతులు పాల్గొన్నారు.
రామగిరి: దుద్దిళ్ల శ్రీధర్కు ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు ఖాకీ యూనిఫాంలకు అవమానాలేనని, ఇప్పటికే పలుమార్లు చెప్పినా పోలీసుల్లో మార్పు రావడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీజీ టీవీ అధినేత పూదరి సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరూ రాజ్యాంగాన్ని తెలుసుకుని అభివృద్ధి చెందవద్దనే కక్షతో మంథని ఎమ్మెల్యే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ఆనాడు మంత్రిగా ఉన్న సమయంలో తనపై అనేక కేసులు పెట్టించడంతో పాటు చివరకు రౌడీషీట్ ఓపెన్ చేయించిన కీర్తి దుద్దిళ్లకే దక్కుతుందని పుట్ట మధూకర్ అన్నారు. ప్రస్తుతం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పూదరి సత్యనారాయణ గౌడ్పై ఇప్పటికే 20 కేసులు పెట్టించి, అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. జూన్ 9న పూదరి సత్యనారాయణ గౌడ్పై ముత్తారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే, రామగిరి పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో సత్యనారాయణ గౌడ్ తల్లి, భార్య ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, ముత్తారంలో కేసు నమోదైందని, తీసుకెళ్లేందుకు వచ్చామని పోలీసులు చెప్పారని అన్నారు. ముత్తారంలో కేసు అయితే రామగిరి పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే, దేశంలో ఎక్కడా లేని విధంగా కేసు పెట్టారని పుట్ట మధూకర్ ఆరోపించారు. పూదరి సత్యనారాయణ గౌడ్ను తీసుకెళ్లేందుకు వచ్చిన రామగిరి పోలీసులపై దాడి చేసేందుకు ఆయన తల్లి, తండ్రి, భార్య, పెద్దమ్మ, బావలు కూడగట్టుకుని ఉన్నారని కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకచోటికి వస్తారని, అలా వచ్చినంత మాత్రాన ఇంత నీచమైన కేసు పెడతారా అని ప్రశ్నించారు. కేసు పెట్టడంతో పాటు 60 ఏళ్ల పూదరి సత్యనారాయణ గౌడ్ తల్లిపై దౌర్జన్యం చేసి గాయపర్చారని ఆరోపించారు. జూన్ 9న కేసు నమోదై ఇప్పటికి 42 రోజులు అవుతోందని, సత్యనారాయణ గౌడ్ను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక్కో బృందంలో పది మంది పోలీసులు, ముగ్గురు ఎస్ఐలు, ఒక సీఐ, ఒక ఏసీపీ, ఒక డీసీపీ స్థాయి అధికారులు 42 రోజులుగా కేవలం సత్యనారాయణ గౌడ్ కోసమే తిరిగారని అన్నారు. సత్యనారాయణ గౌడ్ను పట్టుకోలేకపోతున్నారని ఇటీవల రాత్రి డీసీపీని దుద్దిళ్ల నానా దుర్భాషలాడారని ఆరోపించారు. దుద్దిళ్ల శ్రీధర్ కోసం పనిచేస్తే కోర్టులో చివాట్లు పడ్డాయని, ఏం కేసులు పెట్టారని, ఏం జ్ఞానం ఉందని హైకోర్టు జడ్జి హెచ్చరించారని పుట్ట మధూకర్ పేర్కొన్నారు. ఇప్పటికే రామగుండం సీపీకి విషయం చెప్పామని, ఐపీఎస్ అధికారిగా జాగ్రత్తగా ఉండాలని సూచించినా మార్పు రావడం లేదన్నారు. ఒకవైపు దుద్దిళ్లతో తిట్లు, మరోవైపు హైకోర్టులో చివాట్లతో ఖాకీ యూనిఫాంకు అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. పూదరి సత్యనారాయణ గౌడ్ను పట్టుకోలేకపోతున్నారనే కారణంతో రాజును తీసిపడేసి, వాడుకుని విసిరిపడేయడం దుద్దిళ్లకు అలవాటని పోలీసులు గుర్తించాలన్నారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు దుద్దిళ్ల హైదరాబాద్లో ఉన్నా పూదరి సత్యనారాయణ గౌడ్కు జరిగినట్లే సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్ ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు నమోదైన కేసులపై రివ్యూ పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరాచకాలు, అక్రమ సంపాదనపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చీకటి పాలన పోయే వరకు తన కొడుకుతో పాటు తన కుటుంబం అండగా ఉంటుందని పూదరి సత్యనారాయణ గౌడ్ తల్లి, భార్య చెబుతున్నారని పుట్ట మధూకర్ తెలిపారు. నియోజకవర్గంలోని అనేక కుటుంబాలు కూడా ఇదే నిర్ణయానికి వస్తున్నాయని అన్నారు. ప్రజలు కోరుకునే అభివృద్ధి చేయాలని కోరితే పోలీసులతో అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే దుద్దిళ్ల అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ధన్వాడ స్కూల్లో ఒక్క బెంచీ కూడా వేయలేదని ఆరోపించారు. అమెరికాకు వెళ్లి సొంత ఊర్లకు సేవ చేయాలని చెప్పిన దుద్దిళ్ల.. తన సొంతూరిలో ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడానికి తన చేతులకు మట్టి అంటకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్న దుద్దిళ్ల నీచపు బుద్ధిని ప్రజలు గమనించాలని అన్నారు. ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు పెట్టి, తన వద్ద ఏమీ లేవని చెబుతున్న దుద్దిళ్ల అన్నదమ్ములు హైదరాబాద్లో ప్యాలెస్లు కట్టుకున్న విషయాన్ని ప్రజలకు చూపిస్తామని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు మారాల్సిన అవసరం ఉందని, దుద్దిళ్ల అడుగులకు మడుగులు ఒత్తకుండా బానిసలుగా వ్యవహరించవద్దని పుట్ట మధూకర్ సూచించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను గౌరవించామని, కలిసి పనిచేశామని గుర్తు చేశారు. దుద్దిళ్లతో తిట్టించుకోవడానికి పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదని, రాజ్యాంగం మూలంగానే వారికి ఉద్యోగాలు వచ్చాయని, దుద్దిళ్ల కుటుంబం వల్ల కాదని గుర్తించాలన్నారు.
న్యాయబద్ధమైన కేసు పెట్టి ఉంటే సత్యనారాయణ గౌడ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చేవారని అన్నారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని తిరిగిన రాజును ఎక్కడ పడేశారో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. పదేళ్లు వీళ్ల కోసం తాము పనిచేశామా అని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడుతున్నారని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడితే న్యాయం మన పక్కనే ఉంటుందని పూదరి సత్యనారాయణ గౌడ్ నిరూపించారని పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.
Blog Archive
- July (49)
- June (57)
- May (24)
- April (34)
- March (15)
- February (13)
- January (23)
- December (2)
- November (8)
- October (9)
- September (58)
- August (24)
- July (33)
- June (16)
- May (17)
- April (35)
- March (51)
- February (19)
- January (18)
- December (17)
- November (39)
- October (49)
- September (61)
- August (17)
- July (13)
- June (35)
- May (30)
- April (17)
- March (19)
- February (37)
- January (6)
- December (62)
- November (134)
- October (100)
- September (44)
- August (26)
- July (91)
- June (120)
- May (147)
- April (184)
- March (175)
- February (227)
- January (179)
- December (171)
- November (148)
- October (169)
- September (179)
- August (78)
www.medigaddatvnews.com









