MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహదేవ్‌పూర్, జూలై 5 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించి పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుందని, అయితే పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్ ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుని ఆలస్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తమ పర్యటనకు ఆటంకాలు కల్పించారని విమర్శించారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి తాము రాలేదని, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయడానికే ఈ పర్యటన చేపట్టామని కేటీఆర్ తెలిపారు. గోదావరి నీటిని ఎత్తిపోసి ఎగువ ప్రాంతాలకు తరలించే బృహత్తర ప్రణాళికను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రూ.400 కోట్లతో మరమ్మతులు సాధ్యమని, ఎల్ అండ్ టీ సంస్థ ఉచితంగా మరమ్మతులు చేస్తామని ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. 
ప్రస్తుతం కన్నెపల్లి వద్ద 98 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోందని, మోటార్లు ఆన్ చేస్తే మిడ్ మానేరు, ఎస్‌ఆర్‌ఎస్‌పీతో పాటు ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించవచ్చని తెలిపారు. కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ వరి ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని, దీని ప్రభావం హైదరాబాద్ తాగునీటిపైనా పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ప్రారంభించి నీటిని ఎత్తిపోయాలని, లేదంటే 50 వేల మంది రైతులతో పంప్‌హౌస్‌ను ముట్టడించి తామే మోటార్లు ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇక బీఆర్‌ఎస్ హయాంలో రైతుల కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని, కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు, రైతుబంధుకు రూ.72 వేల కోట్లు, రైతుబీమాకు రూ.30 వేల కోట్లు వెచ్చించామని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

పుట్ట మధూకర్ సవాల్

కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీళ్లు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌లు దమ్ముంటే కన్నెపల్లికి వచ్చి స్వయంగా నీటి లభ్యతను పరిశీలించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సవాల్ విసిరారు. కేటీఆర్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అపఖ్యాతిపాలు చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.
మేడిగడ్డ వద్ద చిన్న మరమ్మతులతోనే ప్రాజెక్టును వినియోగంలోకి తేవచ్చని, కానీ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల ప్రయోజనాల దృష్ట్యా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
భూపాలపల్లి, జూలై 5: భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వేలాదిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భువనగిరిలో నిర్వహిస్తున్న రాజ్యాధికార సమరభేరి సభకు తరలివెళ్లారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. ముందుగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి, అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఊపి వాహనయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, బీసీలకు రాజ్యాధికారం సాధించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఐక్యతతో రానున్న ఎన్నికల్లో పార్టీని విజయవంతం చేసి తీన్మార్ మల్లన్నను ముఖ్యమంత్రిగా చేయడమే తమ సంకల్పమని తెలిపారు. దశాబ్దాలుగా నెరవేరని బీసీల రాజ్యాధికార ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైందని, ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ ఉద్యమంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత వాహనాలు, ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారని తెలిపారు. భువనగిరి సభ విజయవంతం కావడానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ రవి పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహముత్తారం, జూలై 4 (న్యూస్): మహముత్తారం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని కాటారంకు తరలించడం అన్యాయమని, ఇందుకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం మహముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వార్డెన్ స్వయంగా నిర్ణయం తీసుకుని రాత్రికి రాత్రే హాస్టల్‌ను కాటారంకు తరలించడం తీవ్రంగా ఖండించారు. ఈ చర్య వల్ల మారుమూల గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా మహముత్తారంలోని బీసీ బాలుర వసతి గృహం పేద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభ్యాసానికి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రస్తుతం జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాస్టల్‌ను తరలించడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఇటీవల 45 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని, హాస్టల్ తరలింపుతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని బీసీ బాలుర వసతి గృహాన్ని తిరిగి మహముత్తారానికే తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ అజ్మీర పూల్ సింగ్, కో-కన్వీనర్ రామగిరి రాజు, మండల చైర్మన్ ముక్కెర వెంకటస్వామి గౌడ్, మండల కన్వీనర్ లింగమల సడవాలిరావు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
చిదినేపల్లి, జూలై 3: వర్షాకాలంలో దోమల వ్యాప్తిని నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో చిదినేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం "డ్రైడే–ఫ్రైడే" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బాలనే జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద ఉన్న కుండలు, డ్రమ్ములు, వాటర్ బాటిళ్లు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు తదితర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని కోరారు. వర్షాకాలంలో దోమల పెరుగుదలను అరికట్టేందుకు అవసరమైన చోట ఆయిల్ బాల్స్ వేయాలని ప్రజలకు సూచించారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో సహకరించాలని గ్రామపంచాయతీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోరల్ల రాజయ్య, ఆశా వర్కర్, గ్రామపంచాయతీ కార్యదర్శి దేవేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూలై 3: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) కాటారంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చల్ల సునీత తెలిపారు. ప్రస్తుతం 7వ తరగతిలో 12 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం MPCలో 17 సీట్లు, BiPCలో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అడ్మిషన్ పొందాలనుకునే అర్హులైన విద్యార్థినీలు సోమవారం ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు అవసరమైన సంబంధిత విద్యార్హతల సర్టిఫికెట్లతో కేజీబీవీ కాటారం పాఠశాలలో నేరుగా హాజరై స్పాట్ అడ్మిషన్ పొందాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాల కోసం కేజీబీవీ కాటారం ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని కోరారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూలై 1 : విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని "భారతదేశంలో ఫాసిజం: ప్రత్యేకతలు" అంశంపై నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను బుధవారం కాటారం అంబేడ్కర్ సెంటర్‌లో ఆవిష్కరించారు. విరసం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య మాట్లాడుతూ, జూలై 5, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో "భారతదేశంలో ఫాసిజం: ప్రత్యేకతలు" అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఫాసిస్టు ధోరణులను ప్రజలు అర్థం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దువ్వాసి పార్వతి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, పౌర హక్కుల విషయంలో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రజలను విభజించే విధానాలకు వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బాపు మాట్లాడుతూ, ఫాసిజం స్వరూపాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించి, దానిని ఎదుర్కొనే సమగ్ర ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల రాజకీయాలతో మాత్రమే సమస్యలకు పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేష్ మాట్లాడుతూ, సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు రచయితలు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి పనిచేయాలని కోరారు. ఫాసిస్టు ధోరణులను ఎదుర్కొనే భావజాల చర్చలకు ఈ సదస్సు వేదిక కానుందని తెలిపారు. ప్రజాస్వామికవాదులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరై జూలై 5న జరిగే సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, ఆదివాసీ మహిళా నాయకురాలు రాజమణి, ప్రజా సంఘాల నాయకుడు జాగిరి బాలయ్యతో పాటు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
 

కాటారం, జూలై 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలో ఈ నెల 29న జరిగిన వివాహిత రాజమని అలియాస్ రజిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త మంతెన సత్యం (43)ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంతెన సత్యం, రాజమని అలియాస్ రజిత దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రవళి (13), మాన్విత్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతోందనే అనుమానంతో సత్యం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్య మెడపై దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం హత్యకు ఉపయోగించిన కత్తి, ఘటన సమయంలో ధరించిన దుస్తులను తీసుకుని వాటిని ఎక్కడైనా పడేసి పరారవ్వాలనే ఉద్దేశంతో బయ్యారం వైపు నుంచి భూపాలపల్లి–కాటారం ప్రధాన రహదారికి వస్తుండగా, పోలీసులను గమనించిన నిందితుడు పరుగు తీశాడు. అప్రమత్తమైన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్‌ఐ  శ్రీనివాస్ మరియు పోలీసు సిబ్బంది వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని, అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించబడింది. ఈ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్‌ఐ చి. శ్రీనివాస్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ సూర్యనారాయణ అభినందించారు.

Blog Archive


www.medigaddatvnews.com