స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల కలెక్టరేట్లో జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో జాతీయ జెండా గౌరవం, నిబంధనల ఉల్లంఘనపై కథనం ప్రచురించిన ‘నినాదం’ విలేకరిపై నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడం, రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పీక కిరణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలు మరియు అధికారుల లోపాలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యతలో భాగమని పేర్కొన్నారు. వార్తా కథనంపై అభ్యంతరాలు ఉంటే వివరణ ఇవ్వడానికి, చట్టపరమైన మార్గాలను అనుసరించడానికి అవకాశం ఉన్నప్పటికీ నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. విలేకరిపై సీరియస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యగా ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ జెండా గౌరవంపై ప్రశ్నించినందుకు విలేకరిపై కేసు నమోదు చేయడం సముచితం కాదని, అధికారులు వెంటనే స్పందించి కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీర ఫుల్ సింగ్ నాయక్, కన్వీనర్ రామగిరి రాజు, జేఏసీ మండల చైర్మన్ ముఖ్య వెంకటస్వామి గౌడ్, మండల కన్వీనర్ లింగమల్ల సడవల్లి రావు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: