భూపాలపల్లి: ఈ నెల 19న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట్ల ప్రవీణ్ రానున్న నేపథ్యంలో జిల్లాలోని దళితులు, దళిత సంఘాల నాయకులు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని జేఏసీ చైర్మన్ పీక కిరణ్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశంలో కమిషన్ చైర్మన్, సభ్యులు, పలువురు అధికారులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్, ప్రమోషన్లు, దళితులపై జరుగుతున్న కుల వివక్ష, అంటరానితనం, సామాజిక వివక్ష వంటి అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఆధిపత్య కులాల పెత్తనం, దళితులపై వివక్ష, అలాగే ఆయా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించాలని పీక కిరణ్ కోరారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దళిత వర్గాలకు సంబంధించిన సమస్యలను కమిషన్ చైర్మన్, సభ్యుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల జిల్లా కన్వీనర్ అజ్మిర పూల్సింగ్, జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు పాల్గొన్నారు.

Post A Comment: