జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు శాలువాతో మంత్రిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ మారగోని రాజబాపు గౌడ్, వైస్ చైర్మన్ మార్క రవీందర్ గౌడ్తో పాటు వీరగోని కిష్టయ్య గౌడ్, మారగోని బాలయ్య గౌడ్, మారగోని గణపతి గౌడ్, వీరగోని కిరణ్ గౌడ్, పల్లె శంకర్ గౌడ్, మారగోని వెంకటేష్ గౌడ్, మారగోని లింగయ్య గౌడ్, కారంగల రాజీర్ గౌడ్ పాల్గొన్నారు.
పెద్దపల్లి, మే 31: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కార్మికులు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహాముత్తారం మండలంలోని మీనాజిపేట గ్రామంలో “మొదటి 1000 రోజులు – బిడ్డ జీవితానికి బలమైన పునాది” అనే అవగాహన కార్యక్రమాన్ని ఈఓ నిహారిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భధారణ దశ నుండి బిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్ల వయస్సు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు, గ్రామస్తులకు వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత, అదనపు పౌష్టికాహారం, బాలల అభివృద్ధి మైలురాళ్లు, బిడ్డ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పాటించాల్సిన 6 ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తల్లి మరియు శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కాటారం, మే 29: కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తాడిచెర్ల–కాపురం టీఎస్ జెన్కో భూనిర్వాసితుల కమిటీ సభ్యులు, డేంజర్ జోన్ పరిధిలోని ప్రజలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. తాడిచెర్ల జెన్కో డేంజర్ జోన్ పరిధిలోని నివాస గృహాల సేకరణ కోసం టీఎస్ జెన్కో నుంచి రూ.261 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. నిధుల మంజూరుతో డేంజర్ జోన్లో నివసిస్తున్న కుటుంబాలకు ఊరట లభించడంతో పాటు పునరావాస ప్రక్రియ వేగవంతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబుకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతాభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
హనుమకొండ, మే 29 (ప్రతినిధి): రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతల్లో మాత్రం శూన్యమే కనిపిస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం పరకాల, నడికూడ మండలాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులతో కలిసి హనుమకొండలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల దుస్థితి, పార్టీ పరిస్థితులు, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిరోజూ కొత్త మాటలు చెబుతున్నారే తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచాయని, పల్లె ప్రగతి, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారాయని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు నిలిపివేసి సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ప్రజల సమస్యలపై కనీస చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులతో ముందుకెళ్తోందని, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అప్రమత్తంగా ఉండాలని, పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ మండలాల బీఆర్ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి గడపకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సైనికులు ప్రజల మధ్యకు వెళ్లి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అభ్యున్నతి కోసం బలమైన బహుజన శక్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎదుగుతోందని తెలిపారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే బలమైన నాయకత్వాన్ని తయారు చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుండాలని రవి పటేల్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు.
చిట్యాల, మే 27: చిట్యాల మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ ఎదురుగా గోదామును ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సంబంధిత భూమి, గోదామును సందర్శించిన ఆయన అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వే నంబర్ 160లో ఉన్న సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి తమదిగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించి భూమి హద్దులను నిర్ధారించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కాటారం, మే 26: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కాటారం డివిజన్ నాయకుడు జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు. కాటారం డివిజన్ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలను గౌరవించని వ్యక్తికి దేవస్థానం చైర్మన్ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని అన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారనే వార్తలు వెలుగులోకి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆలయాలకు సేవ చేసేందుకు వచ్చే వారిలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాలకు చెందిన మహిళలేనని, అలాంటి వారిని చిన్నచూపు చూడటం లేదా అవమానకరంగా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. అదే పరిస్థితిలో తన కుటుంబ సభ్యులు లేదా మంత్రి కుటుంబానికి చెందిన మహిళలు ఉంటే కూడా చైర్మన్ ఇదే విధంగా వ్యవహరించేవారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్వయంగా స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎండోమెంట్స్ శాఖ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవస్థానం చైర్మన్పై విచారణ జరిపి, అవసరమైతే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దక్షిణ కాశీగా పేరొందిన కాలేశ్వరం క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించరాదని, భక్తుల మనోభావాలను గౌరవించేలా ఆలయ పరిపాలన కొనసాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భూపాలపల్లి, మే 26: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ(ఎంఎల్) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల వల్ల పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదాల కారణంగా అరటి తోటలు, మిరప, మొక్కజొన్న తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతుల పంట నష్టాల వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవల అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేపాకపల్లె దంపతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదాల నివారణపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బంధు క్రాంతి, సుజాత, ఆత్కూరి శ్రీకాంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
సోమవారం ప్రత్యేకత.. దానధర్మాలకు ప్రాధాన్యం
పుష్కరాల తొలి 12 రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. 5వ రోజు సోమవారం కావడంతో శివారాధనతో పాటు దానధర్మాలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. పుష్కర స్నానాల అనంతరం భక్తులు అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటున్నారు. ప్రకృతి పరిరక్షణ, నదీ సంస్కృతి పరిరక్షణకు సంకేతంగా పుష్కరాల సందర్భంగా నదీతీరాల్లో స్వచ్ఛత పాటించాలని, ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని ఆధ్యాత్మిక వేత్తలు పిలుపునిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. రూరల్ పరిధిలోని గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాలకు చెందిన పలువురు యువకులు భారీ ఎత్తున పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బహుజన వర్గాలు పార్టీకి అండగా నిలుస్తున్నాయని, పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో వంద మందిని చైతన్యపరిచి భూపాలపల్లిలో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పేదల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్లను రవి పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్తో పాటు గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దపల్లి,గోదావరిఖని,మే,12 : ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.ముస్త్యాల గ్రామంలోని శ్రీ అభయాంజనేయ ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు,అభిషేకము అర్చనలు నిర్వహించి గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రజలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.మరియు సంపత్తి భోజనం కూడా ఏర్పాటు చేశారు.ఈ హనుమాన్ జయంతి వేడుకల్లో గ్రామ సర్పంచ్ సుంకరి మహేందర్-మాధవి,ఉపసర్పంచ్ బాసినేని వినోద-సత్యనారాయణరావు, వార్డుసభ్యులు,గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
పరకాల, మే 11: కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమవుతున్న నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి రోడ్డులోని న్యూ భాస్కర్ సిమెంట్ అండ్ ఐరన్ దుకాణం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొట్ల చక్రపాణి మాట్లాడుతూ.. కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఆరోపించారు. 2020లోనే పార్లమెంటులో ఆమోదించిన ఈ కోడ్లను దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలో అమలు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేసిందని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఈ కోడ్ల అమలుకు ముందుకొచ్చిందని, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత వాటిని నోటిఫై చేయడం కార్మిక వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లు కార్మికుల సంక్షేమం కోసం కాదని, కార్పొరేట్ సంస్థలకు శ్రమ దోపిడీకి మార్గం సుగమం చేయడానికేనని ఆయన ఆరోపించారు. వీటి రద్దు కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొచ్చు ఆదాం, కృష్ణంరాజు, సాంబయ్య, గణేష్, వేణు, ఓంకార్, రాజు, రమేష్, మొగిలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కాటారం, మే 09 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం తాగునీటి కష్టాలకు నిలయంగా మారింది. వేసవి కాలం దృష్ట్యా ఎండలు మండిపోతున్నా, కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలకు కనీసం మంచినీళ్లు అందించే నాథుడే కరువయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలనుంచి ధరణి, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర ప్రభుత్వ పనుల నిమిత్తం ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ఈ కార్యాలయానికి వస్తుంటారు. అయితే, గంటల తరబడి వేచి ఉండే అర్జీదారులకు గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది.
మరమ్మతులకు నోచుకోని వాటర్ కూలర్:
కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. సాంకేతిక లోపంతో అది పనిచేయకపోవడంతో కేవలం మూలన పడి ఉన్న ‘షోపీస్’లా దర్శనమిస్తోంది. వేసవి తీవ్రత పెరుగుతున్నా అధికారులు దానిని బాగు చేయించడంలో కానీ, ప్రత్యామ్నాయంగా చలివేంద్రం ఏర్పాటు చేయడంలో కానీ చొరవ చూపడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
అవస్థలు పడుతున్న వృద్ధులు, మహిళలు:
దూర ప్రాంతాల నుండి వచ్చే వృద్ధులు, మహిళలు దాహం వేస్తే కిలోమీటరు దూరంలో ఉన్న దుకాణాలకు వెళ్లి నీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలు నీళ్లు కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల గదుల్లో ఏసీలు, చల్లని నీరు అందుబాటులో ఉంటుందని, కానీ తమ దాహార్తిని తీర్చే వ్యవస్థ లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే స్పందించాలి:
జిల్లా అధికారులు మరియు మండల రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించి, కార్యాలయ ప్రాంగణంలో తాగునీటి వసతిని పునరుద్ధరించాలని లేదా కనీసం మంచినీళ్ల ట్యాంకర్ను అందుబాటులో ఉంచాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్లో రాజకీయంగా సంచలనం రేపుతున్న ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్పై పోక్సో కేసు నమోదైంది. తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌజ్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో కూడా అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సాయి భగీరధ్పై BNS సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, తమ కూతురు ఈ ఘటన కారణంగా రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ వర్గం మాత్రం ఈ వ్యవహారం హనీ ట్రాప్ అని, రూ.5 కోట్లు డిమాండ్ చేశారని చెబుతోంది. అంతేకాకుండా ఇప్పటికే రూ.50 వేల రూపాయలు ఇచ్చామని కూడా పేర్కొంటున్నారు. అయితే “ఎలాంటి తప్పు చేయనప్పుడు రూ.50 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు?” అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
రహదారి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కాటారం ప్రాంత ప్రజలు తమ అభివృద్ధి కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక శక్తివంతమైన సాధనమని, దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్: మండలంలోని బొమ్మాపూర్ గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన శ్రీకాంత్ శవం ఎలికేశ్వరం గ్రామ శివారులో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది హత్యా, ఆత్మహత్యా లేక ఇతర కారణమా అన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
పెద్దపల్లి,గోదావరిఖని,మే,1: కార్మిక హక్కులను హరిస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి-సిఐటియు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు ఆర్జి -2ఏరియా కార్యాలయంలో శుక్రవారం 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు బానోత్ వినయ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా మేడే జెండాను ఆవిష్కరించిన ఏరియా సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడరు,చికాగో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పని దినానికి నేడు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.12 గంటల పని దినం,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన,ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కోడ్-2020'ద్వారా కార్మికులతో 12 గంటల వరకు పని చేయించుకునే వెసులుబాటును కల్పించడం అత్యంత దుర్మార్గమని,దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ జీవోల వైఖరి తో కేవలం పెట్టుబడిదారుల లాభాల కోసం 8 గంటలకు బదులు 10 గంటల పనిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవో నెంబర్ 282 వంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.శ్రమ దోపిడీకి పరాకాష్టగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి,ఎల్&టి సుబ్రహ్మణ్యం వంటి కార్పొరేట్ శక్తులు వారంతపు సెలవులు లేకుండా 18 గంటల వరకు పనిచేయాలని కోరడం ఆధునిక బానిసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. కార్మికులకు రక్షణ కవచాలుగా ఉన్నటువంటి 44 చట్టాలను ఈ4లేబర్ కోడ్స్ చేయడం వల్ల కార్మికులకు కనీస వేతనం,పీఎఫ్,ఈఎస్ఐ వంటి సౌకర్యాలు దూరం కావడమే కాకుండా,పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో ఎఫ్ టిఇ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ నియామకాలతో ఉద్యోగ భద్రత కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉల్లి మొగలి,శ్రీహరి,మంద భూమయ్య,లక్ష్మీరాజం,వినేష్,తిరుపతి,శివకుమార్,రమేష్, శ్రావణ్,రాకేష్,లక్ష్మీనారాయణ,రాములు,రవీందర్,రాజు,ఓదేలు తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సాధు సంగీత ముదిరాజ్ అనే మహిళ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, సంగీత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం తీవ్రంగా ఖండనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హనుమకొండలోని సాధు సంగీత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి మనోధైర్యం చెప్పి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ— రాష్ట్రంలో ఒక మహిళ కానిస్టేబుల్కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక బీసీ మహిళ ప్రాణాలు కోల్పోయినా, ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ నిందితులు స్వేచ్ఛగా తిరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సాధు సంగీత ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

































