జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. రూరల్ పరిధిలోని గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాలకు చెందిన పలువురు యువకులు భారీ ఎత్తున పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బహుజన వర్గాలు పార్టీకి అండగా నిలుస్తున్నాయని, పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో వంద మందిని చైతన్యపరిచి భూపాలపల్లిలో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పేదల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్లను రవి పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్తో పాటు గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: