కాటారం, జూలై 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలో ఈ నెల 29న జరిగిన వివాహిత రాజమని అలియాస్ రజిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త మంతెన సత్యం (43)ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంతెన సత్యం, రాజమని అలియాస్ రజిత దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రవళి (13), మాన్విత్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతోందనే అనుమానంతో సత్యం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్య మెడపై దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం హత్యకు ఉపయోగించిన కత్తి, ఘటన సమయంలో ధరించిన దుస్తులను తీసుకుని వాటిని ఎక్కడైనా పడేసి పరారవ్వాలనే ఉద్దేశంతో బయ్యారం వైపు నుంచి భూపాలపల్లి–కాటారం ప్రధాన రహదారికి వస్తుండగా, పోలీసులను గమనించిన నిందితుడు పరుగు తీశాడు. అప్రమత్తమైన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్ఐ శ్రీనివాస్ మరియు పోలీసు సిబ్బంది వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని, అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించబడింది. ఈ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్ఐ చి. శ్రీనివాస్తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ సూర్యనారాయణ అభినందించారు.

Post A Comment: