పరకాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ కోరారు. ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్యార్థుల చేరికలు పెరుగుతాయని అన్నారు. పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికే 15 రోజులు గడిచినా ఇప్పటికీ అన్ని విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెంచీలు లేక విద్యార్థులు నేలపై కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు పవన్ కుమార్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.





Post A Comment: