"కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం" అంటూ భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి అంత్య పుష్కర స్నానాలు ఆచరిస్తూ ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. పుష్కరాల 5వ రోజు సందర్భంగా త్రివేణి సంగమం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు కాళేశ్వరం చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నదీమాతకు నీరాజనాలు అర్పిస్తున్నారు. భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచి భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
సోమవారం ప్రత్యేకత.. దానధర్మాలకు ప్రాధాన్యం
సోమవారం ప్రత్యేకత.. దానధర్మాలకు ప్రాధాన్యం
పుష్కరాల తొలి 12 రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. 5వ రోజు సోమవారం కావడంతో శివారాధనతో పాటు దానధర్మాలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. పుష్కర స్నానాల అనంతరం భక్తులు అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటున్నారు. ప్రకృతి పరిరక్షణ, నదీ సంస్కృతి పరిరక్షణకు సంకేతంగా పుష్కరాల సందర్భంగా నదీతీరాల్లో స్వచ్ఛత పాటించాలని, ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని ఆధ్యాత్మిక వేత్తలు పిలుపునిస్తున్నారు.


Post A Comment: