గణపురం, జూలై 8: గణపురం మండల కేంద్రంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు బి. స్వాతి, జిల్లా కార్యదర్శి బి. సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం AISA నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న విద్యార్థి సంఘమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో AISA కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేపట్టామని తెలిపారు. విద్యార్థుల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భగత్ సింగ్, సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల స్ఫూర్తిని పెంపొందించేందుకు వారి జయంతులు, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై విద్యార్థి నాయకులకు అవగాహన కల్పించి, భవిష్యత్లో విద్యా రంగ సమస్యలపై సమర్థవంతంగా పోరాడే నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే ఈ శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశమని వివరించారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తూ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేసేందుకు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, విద్యాసంస్థలు ఆర్థికంగా, నైతికంగా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో AISA జిల్లా నాయకులు యజ్ఞశ్రీ, అంజలి, ద్రాక్షాయణి తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: