మహా ముత్తారం, జూలై 8 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో విధులు నిర్వహించాల్సిన డ్యూటీ డాక్టర్‌ను నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌పై జిల్లా కేంద్రానికి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మహా ముత్తారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు డ్యూటీ డాక్టర్లు పోస్టింగ్‌లో ఉన్నప్పటికీ, వారిలో ఒకరు అధికారుల సిఫార్సులు, పైరవీలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య గ్రామీణ ప్రజల ఆరోగ్య హక్కులను దెబ్బతీసేదిగా ఉందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పీక కిరణ్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లను జిల్లా కేంద్రాలకు తరలించడం వల్ల స్థానిక పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంబంధిత డాక్టర్ డిప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేసి, ఆయనను యథావిధిగా మహా ముత్తారం పీహెచ్‌సీకి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా చూడాలని, లేనిపక్షంలో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: