కాటారం, జూలై 6: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని, యువతకు మెరుగైన అవకాశాలు లభించాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని, సమాజంలో ఐకమత్యం, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ధన్వాడ గ్రామ ప్రజలు ఐక్యంగా దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు.
అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా గ్రామంలోని ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసి వారి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







Post A Comment: