చిట్యాల, మే 27: చిట్యాల మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ ఎదురుగా గోదామును ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సంబంధిత భూమి, గోదామును సందర్శించిన ఆయన అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వే నంబర్ 160లో ఉన్న సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి తమదిగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించి భూమి హద్దులను నిర్ధారించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు అవసరమైన గోదాముల కొరత తీవ్రంగా ఉందని, రానున్న వర్షాకాల సీజన్లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరిపడా వసతులు లేవని పేర్కొన్నారు. పాత గోదాములను పునర్నిర్మించడంతో పాటు కొత్త గోదాముల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని మారపెల్లి మల్లేష్ హెచ్చరించారు.


Post A Comment: