భూపాలపల్లి : విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఐసా (ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి, జిల్లా కార్యదర్శి బంధు సుజాత డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాట హక్కును హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తుతో పేపర్ లీకేజీలు చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. లాఠీచార్జి ఘటనపై కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమగ్ర ప్రక్షాళన చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల పోరాట హక్కును కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని, లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి విద్యాశాఖలో ప్రక్షాళన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. లాఠీచార్జిపై కేంద్రం క్షమాపణ చెప్పాలి

Post A Comment: