భూపాలపల్లి: ముదిరాజ్ బీసీ వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు, బీసీ ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఎర్ర సత్యం ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. ఎర్ర సత్యం ముదిరాజ్ బీసీ ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ఆయన చేసిన పోరాటాలు, సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. బీసీ ప్రజల హక్కులు, న్యాయమైన వాటా సాధించాలంటే సమాజంలోని బీసీ వర్గాలన్నీ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని రవి పటేల్ పేర్కొన్నారు. ఎర్ర సత్యం ముదిరాజ్ చూపిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎర్ర సత్యం ముదిరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రవి పటేల్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం బీసీ ప్రజలను ఏకం చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘాల నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొని ఎర్ర సత్యం ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Post A Comment: