ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర సందర్భంగా ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఓ వార్త వేగంగా వైరల్ అయింది. ఈ వార్త కారణంగా భక్తులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని పోలీసులు స్పష్టంచేశారు. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, మామిడితోట ప్రాంతంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఐదుగురు యువకులు వాష్రూమ్కు వెళ్లిన బాలికపై అత్యాచారం చేశారని, అనంతరం జంపన్నవాగు సమీపంలో ఓ షాపులో దాక్కున్న వారిని పోలీసులు పట్టుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపిన అనంతరం, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని కూడా అధికారులు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన ములుగు జిల్లా పోలీసు అధికారులు, మేడారం జాతర ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని వివరించారు. జాతర ప్రాంగణం అంతటా భారీగా పోలీస్ బలగాలు, మహిళా పోలీసులు, ప్రత్యేక నిఘా బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. జాతర జరుగుతున్న కాలంలో ప్రతి ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీసుల ప్రకారం, సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా ప్రచారం అవుతున్న వార్తలు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడమే కాకుండా, శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతాయి. అందుకే, ఎవరైనా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారం మాత్రమే విశ్వసించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. జాతర శాంతియుతంగా, సురక్షితంగా కొనసాగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Post A Comment: