కాటారం, జూలై 27: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి సూచించారు. కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పప్పుధాన్యాలు, కూరగాయల విత్తన మేళాలో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గితే భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పాటు సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పంటల ఎదుగుదల మందగించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే ప్రత్తి–కంది, కంది–మొక్కజొన్న వంటి అంతర పంటల విధానాలను అవలంబించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆదాయంలో స్థిరత్వం సాధించవచ్చన్నారు. శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ పంటల వైవిధ్యీకరణ చేపట్టడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.
ఐదు కౌంటర్ల ఏర్పాటు
విత్తన మేళాలో రైతులకు పప్పుధాన్యాలు, కూరగాయల నాణ్యమైన విత్తనాలను సులభంగా అందించేందుకు ఐదు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా వ్యవసాయ అధికారి, మహాదేవపూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కాటారం మండల వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాటారం మండలంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహించే మూడు రోజుల విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.


Post A Comment: