జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అంతర్జాతీయ చెస్ డే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు చెస్ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి పటేల్, గౌరవాధ్యక్షుడు పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ, చెస్ క్రీడ మానసిక వికాసం, ఏకాగ్రత, మేధోసంపత్తి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యార్థులు, యువత చెస్ను అలవర్చుకుని తమ మేధో సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే చెస్ క్రీడ స్నేహభావం, ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మెగా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొనేలా పోటీలను నిర్వహించి చెస్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు అసిఫ్, రాం నారాయణ, సుమన్, దేవేందర్, శ్రీరాములు, కిరణ్, సంతోష్, శంకరయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: