కాటారం, జూలై 17 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాధరావుపేట గ్రామపంచాయతీలో వన మహోత్సవం సందర్భంగా ఇంటింటికీ పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండి సువర్ణ–రమేష్, ఉప సర్పంచ్ కోట అశోక్, 2వ వార్డు సభ్యుడు విలాసాగరం రవి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం కనీసం ఒక పండ్ల మొక్కను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. పండ్ల మొక్కలు ఇంటి పరిసరాలను పచ్చగా మార్చడంతో పాటు కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఫలాలను అందిస్తాయని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ కోట అశోక్ మాట్లాడుతూ నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించి భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాలని గ్రామస్తులను కోరారు. వార్డు సభ్యుడు విలాసాగరం రవి కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రామపంచాయతీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు.

Post A Comment: