కాటారం: దేశంలో ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దంతాలపల్లి, బొప్పారం గ్రామాల్లో రైతుల అవగాహన సదస్సులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. జూలై 17న దంతాలపల్లి గ్రామంలో, జూలై 18న బొప్పారం గ్రామంలోని సడుక్‌పల్లి (శ్రీనివాస కాలనీ) సెంటర్‌లో జరిగిన సదస్సులకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి యాజమాన్యం, పంటల సంరక్షణ వంటి అంశాలపై వ్యవసాయ అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈఓ శ్రీకన్య మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవడంతో పాటు వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, వాతావరణ హెచ్చరికలను పాటించాలని కోరారు. పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలను మార్చుకుంటే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి సహకరించని పరిస్థితుల్లో కూడా రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వ్యవసాయ అధికారుల సలహాలతో శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని అన్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు సమయంలో నాణ్యమైన ఉత్పత్తులనే ఎంపిక చేసుకోవాలని, నీటి వినియోగంలో పొదుపు పాటిస్తూ పంటల నిర్వహణ చేపట్టాలని సూచించారు. సదస్సులో రైతులు పంటల సాగుకు సంబంధించిన పలు సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. రైతుల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు భవిష్యత్‌లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: