కాటారం, జూన్ 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాతిపల్లి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ సభ్యుడు నగునూరు శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు శ్రీనివాస్ను అడ్డుకొని ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడారు. అనంతరం ఆయనను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తాను నిరుపేద కుటుంబానికి చెందినవాడినని, ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అన్యాయంగా తన పేరును జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కక్షలు, పక్షపాత ధోరణులు పక్కనపెట్టి తనలాంటి పేదవారికి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.


Post A Comment: