మహాదేవపూర్, జూన్ 6 : మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్త చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో మొక్కలు నాటారు. "పచ్చదనాన్ని పెంచుదాం – ప్రకృతిని పరిరక్షిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం" అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కల ద్వారా స్వచ్ఛమైన గాలి, నీడ లభించి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. "ప్రకృతి ఉంటేనే ప్రగతి – పర్యావరణం ఉంటేనే మనుగడ" అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్ల సమ్మిరెడ్డి, వార్డు సభ్యుడు సోయం శశికాంత్, గ్రామ కార్యదర్శి చల్లూరి ఇందిర, ఫీల్డ్ అసిస్టెంట్ సల్ల రాజశేఖర్, యువకులు సల్లం రాజు, మంచినీళ్ళ రాజబాపు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.


Post A Comment: