అన్నారం: కాళేశ్వరం ఎక్స్ రోడ్డు వద్ద మూలమలుపులో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కాటారం డివిజన్ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మాదేపూర్ మండలం అన్నారం గ్రామ సర్పంచ్ నీర్ల ప్రభాకర్ నేతృత్వంలో దళిత సంఘాల నాయకులు మాదేపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్నారం గ్రామంలో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు తొలగించేందుకు లేదా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహానికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కోరారు. విగ్రహాన్ని తొలగించే కుట్రకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులో పాత్రధారులు బయటకు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఘటన వెనుక సూత్రధారులు దుద్దిళ్ల కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ఈ విషయంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి అంబేడ్కర్ విగ్రహ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ నీర్ల ప్రభాకర్, సీనియర్ దళిత నాయకులు వేమూరి జక్కన్న, సంపత్ మహారాజ్, గోల్కొండ కిరణ్, జోడు శ్రీనివాస్, జక్కు శ్రావణ్, దిల్లీ రాజు, మహిళా నాయకురాళ్లు చంద్రకళ, అరుణ, కొండ గొర్ల వెంకటస్వామి, బొడ్డు రాజబాబు, అటుకాపురం మల్లేష్, అటుకాపురం రాజేష్, పాలిక గణపతి, వేమూరి తిరుపతి రెడ్డి, పానుగంటి సంతోష్, పెంచిక గట్టయ్య, చుదారి పోచయ్య, పెంచిక మహేష్, పాగే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: