శాయంపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వర్గం పార్టీ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనతో పాటు ఇతర ఏర్పాట్లపై వర్గీయులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిరికొండ మధుసూదనాచారి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన శాయంపేట మండలంలోనే పార్టీ కార్యాలయ ఏర్పాటుకు సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో తన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా నిలిచిన శాయంపేట నుంచే మరోసారి పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ఆయన వర్గం అడుగులు వేస్తోందనే చర్చ జరుగుతోంది.
మండలాల వారీగా కార్యాలయాల ఏర్పాటుకు ప్లాన్?
కేవలం శాయంపేటకే పరిమితం కాకుండా భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సిరికొండ వర్గం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాలను ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మండల స్థాయిలో కార్యాలయాలు అందుబాటులోకి వస్తే పార్టీ కేడర్తో నిత్యం సమావేశాలు నిర్వహించడం, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం మరింత సులభమవుతుందని సిరికొండ వర్గం భావిస్తున్నట్లు సమాచారం.
కార్యకర్తల్లో నూతన ఉత్సాహం
శాయంపేటలో కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తతో సిరికొండ వర్గంలోని నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా రాజకీయంగా స్తబ్దంగా ఉన్న కేడర్ను మళ్లీ యాక్టివ్ చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు చర్చ సాగుతోంది. మండలాల వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలోని పార్టీ కార్యకలాపాలకు ఒక వ్యవస్థ ఏర్పడటంతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పార్టీ మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అసలు మధుసూదనాచారి వ్యూహం ఏంటి?
అయితే శాయంపేట నుంచే పార్టీ కార్యాలయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం వెనుక సిరికొండ మధుసూదనాచారి అసలు వ్యూహం ఏంటి? అనే ప్రశ్న ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడానికే కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారా? లేక రాబోయే రోజుల్లో నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఇప్పటి నుంచే కేడర్ను సిద్ధం చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శాయంపేట నుంచే మరోసారి రాజకీయ కార్యాచరణకు ఊపునివ్వడం వెనుక భవిష్యత్ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయా? అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
గ్రామస్థాయి వరకు పార్టీని తీసుకెళ్లే ప్రయత్నమా?
నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన అమల్లోకి వస్తే గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. స్థానిక సమస్యలపై స్పందించడం, ప్రజా సమస్యలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాల్లో ఈ కార్యాలయాలు కీలకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. శాయంపేటలో కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు సిరికొండ వర్గంలో కొత్త చర్చకు తెరలేపాయి. ఇది కేవలం కార్యాలయం ఏర్పాటా? లేక భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త వ్యూహానికి నాందియా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరి సిరికొండ మధుసూదనాచారి మాస్టర్ ప్లాన్ ఏంటి? శాయంపేట నుంచి మొదలైన ఈ కార్యాలయాల పరంపర భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాలను ఏ దిశగా తీసుకెళ్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Post A Comment: