కాటారం: శక్తి పేరుతో ఐటీఐ, పాలిటెక్నిక్, ఏటీసీ కళాశాలలను విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగే రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. కాటారం మండలం కొత్తపల్లి శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట జీఓ 97కు వ్యతిరేకంగా విద్యార్థినీ, విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీజేపీ కాటారం మండల శాఖ తరఫున రంజిత్కుమార్ మద్దతు తెలిపారు. విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి అత్యవసరంగా జీఓ 97ను తీసుకొచ్చారని ఆరోపించారు. శక్తి పేరుతో ఐటీఐ, పాలిటెక్నిక్, ఏటీసీలను విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జీఓపై విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు జీఓ 97పై ఉన్న సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యను ఏఐసీటీఈ పరిధిలోనే కొనసాగించాలని, విద్యార్థులకు ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే విధానాన్ని కొనసాగించాలని అన్నారు. శక్తి పేరుతో పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని రంజిత్కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఓ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Post A Comment: