కాటారం, ఆగస్టు 21: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు, హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 23న వరంగల్ ప్రెస్ క్లబ్, హనుమకొండలో బహిరంగ చర్చావేదిక నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కాటారంలో కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరత్వం పొందినవారు, జైలు శిక్షలు అనుభవించినవారు, కేసులు ఎదుర్కొన్నవారు, గాయపడినవారు, మానసిక వేధింపులకు గురైనవారు ఎంతోమంది ఉన్నారని కిరణ్ పేర్కొన్నారు. ఉద్యమ కేసుల కారణంగా ఇప్పటికీ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి తగిన గుర్తింపు, సహాయం, సంక్షేమం అందాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజాసంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు, వివిధ కుల సంఘాలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను చర్చావేదికలో వెల్లడించి, ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి నివేదిక రూపంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్డి, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంథని సంజీవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ముఖ్య వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం పాల్గొంటారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చర్చావేదికను విజయవంతం చేయాలని కిరణ్ కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, రాష్ట్ర నాయకులు కామర గట్టయ్య, అయితే బాపు, బూడిది లావణ్య, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: