భూపాలపల్లి, జూన్ 8: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని, ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫీజులు నిర్ణయించే విధంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) నాయకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐసా జిల్లా కార్యదర్శి బి. సుజాత మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఐసా జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ అధిక సంఖ్యలో రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని భావించే తల్లిదండ్రుల ఆశలను కొందరు ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయని ఆరోపించారు. ఐఐటీ, జేఈఈ, నీట్, ఫౌండేషన్ కోర్సులు వంటి పేర్లతో ఆకర్షణీయ ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థులను చేర్పించుకుని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి ధనార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలోని ప్రజల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి అందుబాటు ఫీజులను నిర్ణయించే విధంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు.

Post A Comment: