సిద్దిపేట, జూన్ 12: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో తాటి ఈత చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో, సర్వే నంబర్ 105లో ఉన్న సుమారు 3 వేల తాటి ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయని స్థానిక గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఈ ఘటనలో తాటి చెట్లతో పాటు మోటార్లు, పైపులు పూర్తిగా కాలిపోవడంతో బాధితులకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. గీత కార్మికుల జీవనోపాధికి తీవ్ర దెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గణగోని చంద్రం గౌడ్ మాట్లాడుతూ, తాటి చెట్లను దహనం చేయడం ద్వారా గీత కార్మికుల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీశారని అన్నారు. బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, గ్రామ అధ్యక్షుడు ముష్మీర్ మహేష్ గౌడ్, బొమ్మకంటి రమేష్ గౌడ్, రాచకొండ బాలయ్య గౌడ్, బొమ్మకంటి కిషోర్ గౌడ్, బొమ్మకంటి చక్రపాణి గౌడ్, వ్యాసరేని కనకయ్య గౌడ్, వ్యాసరేని భూమేష్ గౌడ్, ఉత్కం పెంటయ్య గౌడ్, మద్ది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: