మంథని, జూన్ 14: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో చేపడుతున్న చెరువుల సుందరీకరణ పనులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, పోచక్క తల్లి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. తదనంతరం రావుల చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి, భారీ వర్షాలు కురిసేలోపు పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే రాత్రింబవళ్లు పనిచేసి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా పనులకు అంతరాయం కలిగితే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల అమలులో స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అధికారులను ప్రశ్నించిన మంత్రి, ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






Post A Comment: