తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలి. ఈ విధానం ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ నెల 15 తేదీ ఆదివారం కావడంతో, ఒంటిపూట బడులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇదిలా ఉండగా బోర్డ్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేసి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలలకు సూచించారు. విద్యార్థులపై ఎండల ప్రభావం తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Post A Comment: