కాటారం: కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు తొలి విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఎంపీడీవో అడ్డూరి బాబు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణా తరగతులను ప్రారంభించారు. గ్రామపంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలు, గ్రామాభివృద్ధి పనుల అమలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో పారదర్శక పాలనకు, అభివృద్ధి కార్యక్రమాల సమర్థ నిర్వహణకు వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, ప్రజలతో సమన్వయం పెంచుకొని సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని అన్నారు. శిక్షణలో శ్రీనివాస్, డి.రాజశేఖర్, బి.దేవేందర్ రెడ్డి, కె.మహేష్ శిక్షకులుగా పాల్గొని వివిధ అంశాలపై మార్గదర్శనం చేశారు. గుండ్రాత్లి, దామరకుంట, ఎలసాగర్, రంగారం, రేగులగూడెం, శంకరంపల్లి గ్రామాల వార్డు సభ్యులు హాజరయ్యారు.

Post A Comment: