ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత సమయంలో ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు.
కలెక్టర్ బుధవారం సాయంత్రం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, జిల్లా ఉన్నత అధికారుల తో కలిసి జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వివరాలను శాఖల వారీగా అధికారులను కలెక్టర్ అడిగారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పక్కాగా వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని, అనవసరంగా ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ప్రభావంతో వ్యాధులు ముప్పిరిగొనకుండా ముందస్తుగానే అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని పీ.హెచ్.సీలలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారిస్తూ, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించేలా అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని అధికారులకు సూచించారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ కార్య స్థానంలోనే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాతన కాలం నాటి ఇండ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, భోజన వసతి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు వరద నీటి ప్రవాహం తగ్గిన మీదట పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. ఏక్కడా ప్రాణనష్టం సంభవించలేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లవద్దని హితవు పలికారు. ముఖ్యంగా చేపలు పట్టే వారు, ఈత సరదా కోసం పిల్లలు, యువత చెరువులు, వాగులోకి దిగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకుంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించారు.జిడబ్ల్యు ఎంసి ఆధ్వర్యంలో 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు.అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్.1800 425 1115కు కాల్ చేయాలన్నారు.
Post A Comment: