September 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, పేదల ఆశాజ్యోతి, రైతుల ఆపద్బాంధవుడని కొనియాడారు. పేదలు, రైతుల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్‌ సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మహానేతకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మహిళా, యువజన నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను రవి పటేల్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. వైద్యులు సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండాలని కోరారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రోగుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సహించబోదని హెచ్చరించారు. గతంలోనూ ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడామని గుర్తుచేశారు. ఇకముందు కూడా ప్రజలు, రోగుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ జిల్లా నాయకులు మడే సంతోష్, లక్పతి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కాటారం మండల కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరూ సమాన పనికి సమాన వేతనం పొందుతున్నప్పటికీ, పెన్షన్‌ విషయంలో మాత్రం ఉద్యోగుల మధ్య వ్యత్యాసం చూపడం సరికాదన్నారు. 2003 సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని నిలిపివేసి, నూతన పెన్షన్‌ విధానమైన సీపీఎస్‌ను అమలు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఉద్యోగుల భవిష్యత్‌ భద్రతతో పాటు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులు సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానం అమలు చేయడం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాలకు భవిష్యత్‌ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఓపీఎస్‌ పునరుద్ధరణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు రాజు నాయక్‌, టీపీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు బొల్లం సతీష్‌, టీయూటీ మండల అధ్యక్షులు గురిసింగ విజయలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు పద్మజ, సుజాత, సంధ్యారాణి, వెంకటస్వామి, రవిప్రసాద్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: కాటారం మండల పరిధిలో 2026 వానాకాలం (ఖరీఫ్) డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రైతులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని కాటారం వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. సర్వే బృందం రైతుల పొలాల వద్దకు వచ్చిన సమయంలో సంబంధిత రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

పంట వివరాలు ఖచ్చితంగా నమోదు చేయించాలి.

రైతులు తమ పొలంలో సాగు చేసిన పంట రకం, విత్తిన తేదీ, సాగు విస్తీర్ణం తదితర వివరాలను సర్వే సిబ్బందికి ఖచ్చితంగా తెలియజేయాలని అధికారులు సూచించారు. పంటకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని పేర్కొన్నారు.

పలు ప్రయోజనాలకు సర్వే వివరాలే ఆధారం.

డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా నమోదు చేసిన పంట వివరాలు భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం, పంట బీమా పొందేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అలాగే బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడంలో కూడా ఈ వివరాలు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించేందుకు డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదైన పంట వివరాలు ప్రామాణికంగా ఉపయోగపడతాయని తెలిపారు.

తప్పులకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలి.

రైతులు సర్వే బృందం తమ పొలానికి వచ్చినప్పుడు సహకరించి, పంటకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వివరాల నమోదులో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సర్వే సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో మండలంలోని రైతులందరూ భాగస్వాములు కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.