కాటారం: కాటారం మండల పరిధిలో 2026 వానాకాలం (ఖరీఫ్) డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రైతులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని కాటారం వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. సర్వే బృందం రైతుల పొలాల వద్దకు వచ్చిన సమయంలో సంబంధిత రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు తమ పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
పంట వివరాలు ఖచ్చితంగా నమోదు చేయించాలి.
రైతులు తమ పొలంలో సాగు చేసిన పంట రకం, విత్తిన తేదీ, సాగు విస్తీర్ణం తదితర వివరాలను సర్వే సిబ్బందికి ఖచ్చితంగా తెలియజేయాలని అధికారులు సూచించారు. పంటకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని పేర్కొన్నారు.
పలు ప్రయోజనాలకు సర్వే వివరాలే ఆధారం.
డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా నమోదు చేసిన పంట వివరాలు భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం, పంట బీమా పొందేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అలాగే బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడంలో కూడా ఈ వివరాలు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించేందుకు డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదైన పంట వివరాలు ప్రామాణికంగా ఉపయోగపడతాయని తెలిపారు.
తప్పులకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలి.
రైతులు సర్వే బృందం తమ పొలానికి వచ్చినప్పుడు సహకరించి, పంటకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వివరాల నమోదులో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సర్వే సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో మండలంలోని రైతులందరూ భాగస్వాములు కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.


Post A Comment: