భూపాలపల్లి, జూలై 11: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భువనగిరిలో జూలై 5న నిర్వహించిన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయడం పార్టీకి మరింత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇలాంటి భారీ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన పార్టీని విస్తరించేలా కృషి చేయాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేపడుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 2028లో తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ప్రారంభించిన సర్జికల్ స్ట్రైక్ మరియు కౌంట్డౌన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ బీసీ ముఖ్యమంత్రి కాలేదని పేర్కొంటూ, రాజ్యాధికారం సాధించేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా కోఆర్డినేటర్ మామిడి శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్ చరణ్, వామినోజు రాజేందర్, సామల చంద్రశేఖర్, బుర్రి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: