చిద్నేపల్లి, జూన్ 9: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని కాటారం మండలం చిద్నేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దంతాలపల్లి, చిద్నేపల్లి మరియు శ్రీనివాస్ కాలనీలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిద్నేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) దంతాలపల్లి, చిద్నేపల్లి పాఠశాలల ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. డిజిటల్ తరగతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. చిద్నేపల్లి, దంతాలపల్లి, శ్రీనివాస్ కాలనీల్లోని ఐదేళ్లు నిండిన ప్రతి బాలబాలికను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దంతాలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరివెద్ది సత్యనారాయణ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. బడిబాట ర్యాలీలో ఉపసర్పంచ్ కోరళ్ళ రాజయ్య, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, కావేరి, సౌమ్య, స్థానిక నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా కాలనీలు, వీధుల్లో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను ప్రజలకు వివరించారు. అర్హులైన పిల్లల వివరాలను సేకరించి, అక్కడికక్కడే అడ్మిషన్ల నమోదుకు చర్యలు చేపట్టారు.
Home
Chidnepally (చిదినేపల్లి )
దంతాలపల్లిలో ఘనంగా ‘బడిబాట’ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల పెంపుపై అవగాహన

Post A Comment: