భూపాలపల్లి: బీసీల రాజ్యాధికారం, సామాజిక సమానత్వం లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 14,500 కిలోమీటర్ల బీసీల రాజ్యాధికార పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని గోల్కొండ నుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ.. పాదయాత్రను దశలవారీగా నిర్వహిస్తూ బీసీలకు రాజ్యాధికారం, అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు గోల్కొండకు తరలివచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్, వెంకటేష్, సంతోష్, శ్రీను, రాంబాబు, సతీష్, ముక్తేశ్వర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: