భూపాలపల్లి, జూలై 13: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (కేకే కమిటీ) నిజమైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో ప్రజాసంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. సోమవారం బాతల రాజన్న భవన్లోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పీక కిరణ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కామెర గట్టయ్య, జోగుల సమ్మయ్య హాజరై మాట్లాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులతో పాటు ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాలను గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన ఉద్యమకారుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి 250 గజాల ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, నిరుపేద ఉద్యమకారులకు రెండు ఎకరాల భూమి, ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్న నిరుద్యోగ యువతకు రూ.25 వేల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యమకారులపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, భౌగోళిక తెలంగాణ ఏర్పడినప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, ప్రజాస్వామిక తెలంగాణ సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. త్వరలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఉద్యమకారుల భారీ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జాలిగం రాజు, రత్నం కిరణ్, ఐతే బాపు, మల్లేష్, పార్వతక్క, రావుల రమేష్, నారా శంకర్, లావణ్య, మనోజ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: