కాటారం : కాటారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని టిటిడబ్ల్యూయూఆర్జేసీ (TTWURJC) బాలికల హాస్టల్లో ఓ విద్యార్థినికి ప్లాస్మోడియం ఫాల్సిపరం (PF) మలేరియా నిర్ధారణ కావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీహెచ్ మధుసూదన్, జిల్లా మలేరియా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సందీప్ ఆదేశాల మేరకు స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో జిల్లా మలేరియా అధికారి ఏ. సుధాకర్, ఎపిడెమిక్ బృందం సభ్యులు హాస్టల్లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో విద్యార్థినులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. హాస్టల్లోని వంటశాల, భోజనశాల, స్టోర్రూమ్, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే దోమల నివారణ కోసం హాస్టల్లోని అన్ని గదుల్లో ఆల్ఫా సైఫర్మెత్రిన్తో పిచికారీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంతకాని సడవలి మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణించగలరని, హాస్టల్లోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ పౌష్టికాహారం తీసుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. డాక్టర్ మౌనిక విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పర్సనల్ హైజీన్, సమతుల ఆహారం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంతకాని సడవలి, వార్డు సభ్యులు అక్కపాక మల్లయ్య తదితరులు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు మున్వర్, జిల్లా మలేరియా అధికారి ఏ. సుధాకర్, సబ్ యూనిట్ ఆఫీసర్ రమేష్, ఎపిడెమిక్ బృంద సభ్యులు కపర్తి రాజు, ఊరుకొండ గోపీకృష్ణ, తలకోటి పరమేశ్వర్, సతీష్, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Post A Comment: