భూపాలపల్లి, జూలై 5: భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వేలాదిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భువనగిరిలో నిర్వహిస్తున్న రాజ్యాధికార సమరభేరి సభకు తరలివెళ్లారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. ముందుగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి, అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఊపి వాహనయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, బీసీలకు రాజ్యాధికారం సాధించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఐక్యతతో రానున్న ఎన్నికల్లో పార్టీని విజయవంతం చేసి తీన్మార్ మల్లన్నను ముఖ్యమంత్రిగా చేయడమే తమ సంకల్పమని తెలిపారు. దశాబ్దాలుగా నెరవేరని బీసీల రాజ్యాధికార ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైందని, ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ ఉద్యమంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత వాహనాలు, ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారని తెలిపారు. భువనగిరి సభ విజయవంతం కావడానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ రవి పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
భారీ వర్షాన్నీ లెక్కచేయని జనసందోహం.. భూపాలపల్లి నుంచి భువనగిరికి భారీ ర్యాలీ



Post A Comment: