పలిమెల, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన పలిమెల మండల పరిధిలో గోదావరి సరిహద్దు గ్రామాల్లో వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదన్నారు. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామాల్లోని వీధులు, గుంతల్లో మురుగునీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో దోమల బెడద పెరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంత ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు దోమతెరలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. సరిహద్దు గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిరంతర నిఘా ఉంచి ముందస్తుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వర్షాలు కురిసే ముందే దోమతెరల పంపిణీ చేపట్టకపోతే గ్రామాలు జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు దారకొండ సూర్యశంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: