కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతి నిర్వహణపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ మండల శాఖ ఖండించింది. బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్, మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఉత్సవ సమితిపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. గత నెల ఫిబ్రవరి 19న కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించామని, అయితే అనంతరం పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం బాధాకరమని తెలిపారు. కాటారంలో హిందువులు శివాజీ జయంతి జరుపుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. ఇదే మండల కేంద్రంలో జయంతి, వర్ధంతి పేరుతో ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కేసులు ఎందుకు పెట్టరని ఆయన నిలదీశారు. హిందువులు ఐక్యంగా ఉంటే హిందూ వ్యతిరేకుల ఆగడాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీజేపీ తరఫున త్వరలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: