ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఆర్టీసీ సిబ్బంది ఎప్పటికప్పడు తమ పనితనం మెరుగుపరుచుకుంటూ సంస్థ వృద్ధికి పాటుపడాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్‌  పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్‌డేట్‌ అవుతూ కొత్త ఆలోచనలు చేయాలని ఆయన అన్నారు. 

వరంగల్‌ రీజియన్‌ అధికారులతో స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్‌  గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రీజియన్‌ పనితీరు, రూట్ల క్రమబద్దీకరణ, లాభనష్టాలపై అధికారులను ఆరా తీశారు. 

ఈ సందర్భంగా సజ్జనార్‌  మాట్లాడుతూ ప్రయాణికులు, సిబ్బంది ఆర్టీసీకి రెండు కండ్లు లాంటివని, సంస్థ వీరిద్దరికి ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క సిబ్బంది నిబద్దతతో పనిచేయాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లని వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత మనపై ఉందనే విషయం మరిచిపోవద్దన్నారు. గత ఏడాది ప్రయాణికులు సంస్థను మంచిగా ఆదరించారని గుర్తు చేశారు.

అంతకుముందు హన్మకొండ బస్టాండ్‌ను పరిశీలించారు. ప్రయాణికులతో ముచ్చటించారు. బస్సుల్లో కల్పిస్తోన్న సౌకర్యాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.  ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రోత్సహించాలని, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ఇతరులకు చెప్పాలని వారిని కోరారు. అనంతరం హన్మకొండ బస్టాండ్‌ విస్తరణ పనులను ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ , గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌ పి. ప్రావీణ్య , కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) చైర్మన్‌ సుందరరాజ్‌ యాదవ్‌ లతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌  పరిశీలించారు. విస్తరణ పనుల పురోగతిపై వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గతంతో పోల్చితే హన్మకొండ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు. విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అత్యాధునిక హంగులతో కూడిన ప్లాట్‌ఫాంలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అలాగే, వరంగల్‌-1, 2 డిపోలను ఎండీ సజ్జనార్‌ సందర్శించారు. అందులోని వివిధ విభాగాలను పరిశీలించారు. 

సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డిపోల పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. ఏసీ బస్సులను శుద్ధి చేసే విధానాన్ని ఆవిష్కరించిన సిబ్బందిని ఈ సందర్భంగా ప్రశంసించారు. నూతన ఆవిష్కరణలు చేసే ఉద్యోగులను సంస్థ ప్రోత్సహిస్తుందని చెప్పారు.

టీఎస్‌ఆర్టీసీకి సహకరించాలని వరంగల్‌, హన్మకొండ జిల్లాల అధికారులను ఎండీ వీసీ సజ్జనార్‌  కోరారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను స్వయంగా కలిశారు. వరంగల్‌ సీపీ రంగనాథ్‌, ఐపీఎస్‌, వరంగల్‌ కలెక్టర్‌ గోపి, ఐఏఎస్‌, హన్మకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఐఏఎస్‌, వరంగల్‌ అడిషనల్‌ కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌) అశ్విని, ఐఏఎస్‌  ను కలిశారు. ఈ కార్యక్రమాల్లో టీఎస్‌ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌, కరీంనగర్‌ ఈడీ వి.వెంకటేశ్వర్లు, వరంగల్‌ ఆర్‌ఎం జే.శ్రీలత, తదితర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: