ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్న కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. పథకం రద్దు కాలేదని, పేరు మాత్రమే మారిందని బీజేపీ VB GRAM G పెద్దపల్లి జిల్లా కో-కన్వీనర్ డా. మొహమ్మద్ రఫి స్పష్టం చేశారు. ఈరోజు కాటారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో డా. రఫి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ పేరుతో ప్రారంభించిన పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం చేసిందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
VB G RAM G చట్టం – పేదల అభ్యుదయానికి కొత్త దిశ
దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పాత MGNREGA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ “VB G RAM G Act – 2025 (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మిషన్)”గా మార్పులు చేసిందని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త చట్టంలో పేదలు, వలస కూలీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన కులాలు, పేద రైతులు, మైనార్టీ వర్గాల్లోని పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
125 రోజుల ఉపాధి – మౌలిక వసతులకు ప్రాధాన్యం
పాత చట్టంలో 100 రోజుల పని ఉండగా, కొత్త చట్టంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ కల్పించనున్నట్లు తెలిపారు. మట్టి పనులతో పాటు చెరువులు, చెక్డ్యాములు, పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీలు, రోడ్లు, కాలువలు, షెడ్లు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక బృందాల మహిళల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
గాంధీ ఆశయాల కొనసాగింపు
గ్రామ స్వరాజ్యం, గ్రామ వికాసం, గ్రామాల్లో ప్రజలు గౌరవంగా జీవించాలన్న మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ చట్టం రూపుదిద్దుకుందని డా. రఫి అన్నారు. పేరు మార్పు మాత్రమే సంస్కరణలలో భాగమని, పథకాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు జిల్లెల శ్రీశైలం యాదవ్, మండల ప్రధాన కార్యదర్శులు ఆత్మకూరి స్వామి యాదవ్, మంత్రి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: