Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
జయశంకర్ భూపాలపల్లి, : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డులకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలు, రాష్ట్ర కమిటీ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఐదుగురు అభ్యర్థులకు అధికారికంగా బీ-ఫారాలు అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులు వివరాలు ఇలా ఉన్నాయి.
భూపాలపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి అవధూత కవిత,
18వ వార్డు నుంచి గాజ వేణుగోపాల్,
22వ వార్డు నుంచి కౌటం సౌమ్య,
28వ వార్డు నుంచి ఇనుగాల ప్రణయ్ రాజ్,
29వ వార్డు నుంచి మామిడి శ్రీకాంత్ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, తెలంగాణలో బహుజనుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతోందని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో ఇతర పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, నేడు మన బహుజన అభ్యర్థులకు మన పార్టీ నుంచే బీ-ఫారాలు అందజేయడం గర్వకారణమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన టీఆర్పీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం టీఆర్పీ పార్టీ అభ్యర్థులు ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.పి.కే సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు సంతోష్, శ్రీకాంత్, సిద్ధు, జస్వంత్, కోటేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


